నాగర్కర్నూల్, నవంబర్ 25: మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ నీటిని డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లో అన్ని మున్సిపాలిటీల అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, క్రిమిటోరియం, వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుపై చర్చించారు. మున్సిపాలిటీల్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయో పక్కాగా వివరాలు సేకరించాలన్నారు. ఫ్లో మీటర్లు ఎక్కడ, ఎన్ని పెడుతున్నారనే పూర్తి వివరాలతో రావాలని వారిని ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కావాలని ఆదేశించారు. క్రిమిటోరియం, సమీకృత మార్కెట్ భవనాల నిర్మాణంపై ఆరా తీశారు. అన్ని మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకటనలపై, ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్, అద్దె రికవరీపై ఆరా తీశారు. వందశాతం పన్ను వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలకు, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి జరిమానా విధించాలన్నారు. ఆక్రమణలు తొలగించాలని, అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, టౌన్ప్లానింగ్ అధికారి డీఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఏఈలు పాల్గొన్నారు.
మౌలిక వసతులు సమకూర్చాలి
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా అన్ని ప్రభుత్వ బడుల్లో మౌ లిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చ ర్యలు చేపట్టాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు. డీఈవో, అన్ని రెసిడెన్షియల్ సంస్థల అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ, డీఆర్డీవో, ఎంపీవోలతో మౌ లిక సాదుపాయల కల్పనపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, కిచెన్ హాల్, కిచెన్ గార్డెన్, ఇంకుడుగుంతలు, రూప్ వాటర్, హార్వెస్టింగ్ వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియళ్లకు అవసరమైన వసతులపై వెంటనే డీఆర్డీవోకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు తమ పరిధిలోని పాఠశాలల నివేదికను ఆన్లైన్లో నమోదు చేసి వర్క్ ఆర్డర్ జనరేట్ చేయాలని సూచించారు. న్యూట్రీగార్డెన్స్ ఏర్పాటుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో నర్సింగరావు, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి వెంకటలక్ష్మి, ఎంపీడీవోలు, ఎం ఈవోలు పాల్గొన్నారు.
తక్కువ బరువు ఉన్న పిల్లల సంఖ్య తగ్గించాలి
జిల్లాలో పోషకాహార లోపంతో తక్కువ బరువు ఉన్న పిల్లల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల విషయమై సమీక్ష నిర్వహించారు. పిల్లల సంఖ్యను 6వేల నుంచి 12వందలకు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇదేస్ఫూర్తితో పనిచేస్తూ డిసెంబర్ చివరినాటికి జిల్లాలో ఏ ఒక్కరూ పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని సీడీపీవోలకు సూచించారు. అనంతరం జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు మంజూరైన సెల్ఫోన్లను కలెక్టర్, అదనపు కలెక్టర్ అందజేశారు. అంతకుముందు కరోనా కారణంగా నష్టపోయిన విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ, సంక్షేమశాఖ అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ మనూచౌద రి, డీఈవో గోవిందరాజులు, డీడబ్ల్యూవో, సీ డీపీవోలు పాల్గొన్నారు.