అచ్చంపేట, జూలై 3: పట్టణంలోని పలువార్డుల్లోని ఖాళీ ప్రైవేట్ ప్లాట్లలో ఉన్న చెట్లు, ముళ్లపొదలను యజమానులే తొలగించుకోవాలని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్ అన్నారు. పట్టణప్రగతిలో భాగంగా కొనసాగుతున్న పనులను శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజుతో కలిసిపలు వార్డుల్లో పర్యటించి పనులను పరిశీలించారు. వార్డుల్లో ఖాళీ ప్రైవేట్ ప్లాట్లు ఉన్నాయని, అందులో చెట్లు, ముళ్లపొదలు పెరిగి పరిసర ఇండ్లల్లో నివాసం ఉంటున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొదటిసారి కావడంతో మున్సిపల్ ఆధ్వర్యంలో తొలగిస్తున్నామని, మరోసారి పెరిగితే ప్లాటు యజమానికి జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీ ప్లాట్లను శుభ్రం చేయించుకునే బాధ్యత ప్లాటు యజమానికే సంబంధమన్నారు. పట్టణవాసులు, ప్లాట్ల యజమానులు మున్సిపల్శాఖకు సహకరించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఆయన వెంట కౌన్సిలర్లు రమేశ్రావు, అంతటిశివ, ప్రత్యేకాధికారి జైపాల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లెప్రగతితో పండుగ వాతావరణం
అచ్చంపేట రూరల్, జూలై 3: పల్లెప్రగతితో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. శనివారం మండలంలోని బోల్గట్పల్లిలో పల్లెప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మొదటిరోజు గ్రామసభ అనంతరం వీధుల్లో తిరిగి పాడుబడిన ఇండ్లు, గోడలు, ముళ్లపొదలు తొలగించడం, గుంతలను పూడ్చడం వంటి పనులను గుర్తించి అమలు చేస్తున్నారు. పాడుబడిన ఇండ్లను, గోడలను తొలగించి ముళ్లపొదలను తొలగించారు. కాలనీల్లో పిచ్చిమొక్కలను తొలగించి పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ బీకిని, పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు నాయకులు రాము, శేఖర్ తదితరులు ఉన్నారు.