నాగర్కర్నూల్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పోడు రైతులకు భూమిపై హక్కు కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాల తరబడిగా పోడు భూముల సమస్య వేధిస్తోంది. అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు, అడవులను రక్షిస్తున్న అటవీ శాఖాధికారులకు మధ్య వివాదంగా పోడు సమస్య నెలకొన్నది. పలుమార్లు వివాదాలకు, ఘర్షణలకు దారి తీస్తోంది. అటవీ ప్రాంతంలో భూములను చదును చేసుకొని దశాబ్దాల తరబడిగా చెంచు, గిరిజనులు, ఇతరులు సాగు చేసుకొంటున్నారు. అయితే ఈ భూమిపై శాశ్వత హక్కు మాత్రం సంబంధిత రైతులకు ఇంతవరకు లభించలేదు. దీంతో ఈ భూములపై ఆధారపడిన రైతులు ప్రభుత్వ పథకాలకు దూరంగానే ఉండిపోతున్నారు. కాగా చాలా మంది ఇతర ప్రాంతాల వ్యక్తులు సైతం అడవుల్లోకి వెళ్లి చెట్లు నరికి భూములను కబ్జా చేసే పనులు చేపడుతున్నారు. అయితే సర్కార్ హరితహారం పథకంలో భాగంగా అటవీ పరిరక్షణ, పెంపుదల కోసం చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగా అడవులను కాపాడటంతో పాటుగా పోడు రైతులకు న్యాయం చేసేందుకు నిర్ణయించింది. దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేసేలా పావులు కదుపుతుంటే ప్రభుత్వం మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గతేడాది నవంబర్లో 10 రోజులపాటు ప్రభు త్వం గ్రామ స్థాయిలో పోడు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. పోడు భూములకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం-2006లో రాకముందు, వచ్చాక అని రెండు రకాలుగా వర్గీకరించారు. దీని ప్రకారం 1930 నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరులు, 2005కు ముందు సాగు చేస్తున్న గిరిజనులకు మాత్రమే పరిమిత సంఖ్యలో హక్కు పత్రాలు మంజూరయ్యాయి. ఇంతకు ముందు 2008-09లో, 2011-12లో ఇలా కొందరికి పట్టాలిచ్చారు. కాగా 2006కన్నా ముందు సాగులో ఉన్న రైతులు, అప్పట్లో దరఖాస్తు చేసుకోని రైతుల నుంచి గత నవంబర్లో ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. స్వీకరించకముందు అధికారుల అంచనా మేరకు 2,302మంది రైతుల ఆధీనంలో 7,449 ఎకరాల ఆయకట్టు చెంచులు, చెంచేతరుల స్వాధీనంలో ఉన్నట్లుగా భావించారు.
అయితే దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక ఊహించిన దానికంటే అధికంగా పోడు భూములపై వినతులు రావడం కొసమెరుపు. ఏకంగా 11,500 మంది రైతుల నుంచి 35 వేల ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. ఇందులో ఎస్టీ రైతులు 4,614 మంది నుంచి 17,166 ఎకరాలకుగానూ దరఖాస్తులు రాగా, 5,517 మంది గిరిజనేతరులు 18,024 ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నివేదించి ప్రభుత్వానికి పంపారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన పోడురైతులను గుర్తిస్తారు. ఉమ్మడి పాలమూరులోనే నాగర్కర్నూల్లో అత్యధికంగా పోడు భూములు ఉన్నాయి. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం, చిట్లంకుంట, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, సోమశిల, పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రబండతండా, మారేడుమాన్దిన్నె తండా, అచ్చంపేట, పదర, లింగాల మండలాల్లో అధిక సంఖ్యలో పోడు రైతులు ఉన్నారు.
కమిటీల నియామకం
పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పది నెలల కిందట దరఖాస్తులు స్వీకరించగా వాటిని పరిష్కరించేలా గిరిజన సంక్షేమ శాఖ జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలను సర్కార్ నియమించింది. దీనికి జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్లు కన్వీనర్లుగా ఉంటారు. అలాగే అధికారిక సభ్యులుగా ఎస్పీ, ఐటీడీఏ అధికారి, స్థానిక సంస్థలు, రెవెన్యూ శాఖల అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారి, డీఆర్డీవో, డీపీవో, గిరిజన సంక్షేమాధికారి సభ్యులుగా కొనసాగనున్నారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. జిల్లా సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు అటవీ భూముల పరిరక్షణతో పాటుగా కొత్తగా ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాయి. ఇలా గ్రామ స్థాయి నుంచి పోడు భూములపై ఏకాభిప్రాయ సాధనకు కమిటీలు చర్యలు చేపట్టనున్నాయి. పోడు రైతుల ఆధీనంలో ఉన్న భూముల వివరాలను ఈ కమిటీ వాస్తవంగా అంచనా వేస్తున్నది. ఇలా ఏర్పాటైన కమిటీ పోడు భూముల సమస్యల పరిష్కారానికి అడుగులు వేయనున్నది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. దీంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
సర్కార్ ఆదేశానుసారం జిల్లా ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. నాగర్కర్నూల్ జిల్లాలో 6 లక్షల ఎకరాల భూమి ఉండగా అటవీ శాఖాధికారుల అంచనా మేరకు దరఖాస్తులకు ముందు 2,302 మంది రైతుల ఆధీనంలో 7,449 ఎకరాల ఉన్నది. దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక జిల్లా నుంచి 10,131మంది నుంచి 35,194 ఎకరాల ఆయకట్టు పట్టాల కోసం దరఖాస్తులు వచ్చాయి. అంచనాకు మించి దరఖాస్తులు రావడంతో కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలో గ్రామ సభలు నిర్వహించి హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– అనిల్, గిరిజన సంక్షేమ జిల్లా అధికారి