నాగర్కర్నూల్, జూలై 29(నమస్తే తెలంగాణ): రైతులపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకున్నది. రైతుబంధు పథకంపై ప్రతిపక్షాలు దుష్ర్పచారాన్ని తిప్పికొడుతూ రైతులందరికీ రైతుబంధు సాయాన్ని అందజేసింది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న సర్కారు 2018, మే 10నుంచి ఈ పథకం ఎకరాకు రూ.4వేలతో ప్రారంభించింది. తొలుత వానకాలం, యాసంగి సీజన్లలో రెండు పంటలకు కలిపి సంవత్సరంలో రూ.8వేల చొప్పున ఆర్థికసాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చేయడం జరిగింది. కాగా, పెరిగిన ధరలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2019-20నుంచి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున పెంచడం విశేషం. ఇలా ఏటా రెండు పంటలకు రూ.10వేల ఆర్థికసాయం ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి జిల్లాలో రూ.వందల కోట్లల్లో రైతులకు ప్రభుత్వం నేరుగా మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు పథకం అమలుపై దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పారదోలేలా కుట్రలకు పాల్పడుతూ వచ్చాయి. అయితే సీఎంగా కేసీఆర్ ఉన్నంత వరకు పథకం ఆగదంటూ స్పష్టం చేసిన ప్రభుత్వం ఈ వానకాలంకు సాగను జూన్ 28నుంచి పెట్టుబడి సాయం ప్రారంభించింది.
చిన్న రైతుల నుంచి మొదలుకొని పెద్ద రైతుల వరకు ఇలా రైతులందరికీ ఈ సీజన్కు సంబంధించి పెట్టుబడి డబ్బులు జమ చేసింది. కొత్త రైతులకు సైతం ఈ పథకంలో అవకాశం కల్పించటం గమనార్హం. ఇలా ప్రతి సంవత్సరం రైతుబంధు ద్వారా లబ్ధిపొందే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీలతో పాటుగా కులాలకు, మతాలకు అతీతంగా పాస్ పుస్తకం ఉన్న రైతులందరికీ భూవిస్తీర్ణం ప్రకారంగా రైతుబంధు సాయం అందుతున్నది. ఈ సీజన్లో రైతుబంధు పంపిణీ ఆరు రోజుల కిందటే పూర్తయింది. కేంద్రం పీఎం కిసాన్ యోజన పథకానికి భిన్నంగా రైతుబంధు ద్వారా రైతులందరికీ సాయం జమ చేస్తూ తెలంగాణలో రైతాంగానికి, తద్వారా సాగుతో ఉత్ఫాదకత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇలా జిల్లాలో గతేడాది కంటే రూ.2కోట్లు అదనంగా రూ.368కోట్ల చొప్పున రైతుబంధు డబ్బుల పంపిణీ జరగడం విశేషం. రైతుబంధు పంపిణీ పూర్తి కావడంతో రైతుబీమా అమలుకు ప్రభుత్వ కార్యాచరణ చేపట్టింది. కొత్త రైతుల పేర్లను సేకరించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నెల 31వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది. జిల్లాలో 2018నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ.2,580కోట్ల నిధులు రైతుల ఖాతాలో మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచి రైతుకు చేరడం విశేషం.
రూ.368కోట్లు జమయ్యాయి
జిల్లాలో రైతుబంధు పంపిణీ దాదాపుగా పూర్తయింది. ఏటా రైతుల సంఖ్య పెరుగుతున్నది. పాస్పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించాం. నాగర్కర్నూల్ జిల్లాలో 2.87లక్షల మందికి ఈ సీజన్లో రూ.368కోట్లు పంపిణీ జరిగింది. ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్లోనే అత్యధిక మంది రైతులకు సాయం అందుతున్నది.
– వెంకటేశ్వర్లు,డీఏవో, నాగర్కర్నూల్