నాగర్కర్నూల్, జూన్ 23: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులను పెంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో గోవిందరాజులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలైన చైతన్య, ప్రీజమ్ ఉన్నత పాఠశాలలను డీఈవో గురువారం సందర్శించారు. ఫీజులను ఇష్టానుసారం పెంచడానికి వీలులేదని, పాఠశాల గవర్నింగ్ బాడీ తీర్మానంతో గతేడాది కంటే పదిశాతం మాత్రమే పెంచడానికి అవకాశం ఉందన్నారు. అదేవిధంగా పాఠశాలల ప్రాంగణంలో ఎలాంటి టెక్స్ బుక్స్, యూనిఫాం అమ్మడానికి వీలులేదని, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అమ్మినట్లయితే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు సరిపడా మూత్రశాలల సౌకర్యాలు కల్పించడంతోపాటు వాటి నిర్వహణ కూ డా సరిగ్గా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో తప్పనిసరిగా సైన్స్ ల్యాబ్, లైబ్రరీ నిర్వహణ ఉండాలని, లేకపోతే నోటీస్ అందజేస్తామన్నారు. విద్యార్థులను వేరే గ్రామాల నుంచి గానీ, స్థానికంగా గానీ పాఠశాలలకు తీసుకొని రా వడానికి బస్సులు ఏర్పాటు చేసుకుంటే ప్ర తి బస్సుకు ఒక అటెండర్ ఉండేటట్లు ఏర్పా టు చేసుకోవాలని పాఠశాలల యాజమాన్యానికి తెలియజేశారు. పైనిబంధనలను జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విధిగా పాటించాలని లేకపోతే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. డీఈవో వెంట స్టాంగ్ టీచర్ వెంకటేశ్వర్లశెట్టి ఉన్నారు.