అచ్చంపేట, జూన్ 22 : వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు ఆర్థిక సాయాన్ని ఈనెల 28వ తేదీ నుంచి రైతు ఖాతాలో జమ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రైతుకీ ఎకరానికి రూ.5వేల చొప్పున పంటపెట్టుబడి ఆర్థిక సాయం ఎప్పటిలాగే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమా చేయనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయం అందించి తెలంగాణ సర్కారు అండగా నిలబడుతుంది. 2022-23 వానకాలం పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వానకాలం సీజన్ ప్రారంభంకావడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా, అప్పులు చేయకుండా రైతులు అడగకుండానే వారికి నగదు రూపంలో సాయం అందించనుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా సాగు విస్తీర్ణం పెరిగింది. అచ్చంపేట నియోజకవర్గంలో దాదాపు 93వేల మంది రైతులకు రూ.131కోట్లకు పైగా నిధులు నేరుగా రైతు ఖాతాలో జమ కానున్నాయి. గతం యేడాది వానకాలానికి, ఈ సారి వానకాలానికి సాగు విస్తీర్ణం పెరగడంతో కొంతమంది రైతులకు కొత్తగా సాయం అందనుంది. అచ్చంపేట నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో రైతుబంధు సాయం కింద గత వానకాలంలో ఒక్క సిజన్కే దాదాపు రూ.131కోట్ల నిధులను అందజేసింది. యాసంగి, వానకాలం సీజన్ను కలుపుకొని ఏడాదికి రూ.262కోట్ల నిధులను రైతుకు నేరుగా వారి ఖాతాలో జమ చేసింది. ఈ సారి వానకాలం పంటకు పెట్టుబడి సాయం పెరిగే అవకాశం ఉన్నది. వానకాలం పెట్టుబడి సాయం పొందనున్న రైతులు వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి సాధిస్తు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆస్కారం లభిస్తున్నది.