నాగర్కర్నూల్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రైతుల మోముల్లో ఆనందం నింపారు సీఎం కేసీఆర్. ఈ వానకాలం పంటల పెట్టుబడులకు అమలు చేస్తున్న ఎకరాకు రూ.5వేల ఆర్థిక సాయం అన్నదాతలకు అందించేందుకు వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఈనెల 28నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా ఈ డబ్బులు జమ కానున్నాయి. సీఎం ఆదేశంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వులతో జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు రైతుబంధు అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.
28నుంచి ఖాతాల్లోకి..
రైతుబంధు పథకం అమలుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. వానకాలం, యాసంగి సీజన్లలో పంటల పెట్టుబడులకు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్నది. 2018, మే 10నుంచి ఈ పథకం రూ.4వేలతో ప్రారంభమైంది. రెండు పంటలకు కలిపి సంవత్సరంలో రూ.8వేల చొప్పున ఆర్థిక సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చేయడం జరిగింది. కాగా పెరిగిన ధరలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2019-20నుంచి ఎకరాకు రూ.వేయి చొప్పున పెంచడం విశేషం. ఇలా ప్రతి సంవత్సరం రెండు పంటలకు రూ.10వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోంది. దీనివల్ల రైతులు సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులకు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు, పల్లెల్లో మధ్యదళారులను ఆశ్రయించడం తగ్గింది. దీనివల్ల రైతులకు పంటల సాగు ఆరంభ పెట్టుబడులకు కష్టాలు తీరాయి. ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాని బృహత్తర పథకం సీఎం కేసీఆర్ అమలు చేస్తూ రైతుల పట్ల తనకున్న ఉదారతను నిరూపించుకొంటున్నారు. దీంతో పాటుగా 24గంటల ఉచిత కరెంట్, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులు, కుంటలను నింపి, కాల్వల ద్వారా పంటలకు సాగునీరు అందుతున్నది. అలాగే రైతులకు రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించడం, పండించిన పంటలకు మద్దతు ధరతోపాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించి గిట్టుబాటు ధరను అందిస్తున్నది. ఇలా రైతులు పంటలు పండించడం నుంచి కొనే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ప్రోత్సహిస్తున్నది. ఇలా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, ఇతర పథకాలతో గ్రామాల్లో బీడుబడిన భూములు పచ్చగా మారాయి. వరి, వేరుశనగ, పత్తి, పప్పు, నూనె గింజల సాగుతో ఊళ్లోనే వ్యవసాయ పనులు దొరుకుతున్నాయి. ఫలితంగా రైతు కూలీలు, పేదల వలసలు తగ్గాయి. కాగా కేంద్రం వరి రైతులను నష్టపరిచేలా ధాన్యం సేకరణకు నిరాకరిస్తున్నా సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ యాసంగి ధాన్యాన్ని సేకరించడం గమనార్హం. ఇలా రైతుల పట్ల సీఎం కేసీఆర్కు ఆదరణ పెరుగుతున్నది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు రైతుబంధు, ఇతర పథకాల పట్ల దుష్ప్రచారం చేస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేలా సీఎం కేసీఆర్ బుధవారం ఆదేశాలు జారీ చేయడంతో ఈనెల 28నుంచి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తం మీద రైతుబంధు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 9లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరనున్నది.
దరఖాస్తులు స్వీకరించాం
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈనెల 28నుంచి రైతుబంధు పథకం అమలు అవుతుంది. గత యాసంగి సీజన్ ప్రకారం కాస్త అటు ఇటుగా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల కోసం గత మేలో దరఖాస్తులు స్వీకరించాం. ఇలా అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది.
– వెంకటేశ్వర్లు, డీఏవో,నాగర్కర్నూల్