ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 25: అచ్చంపేట అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 14, 15వార్డుల్లో ప్రచారం చేసి మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నదని, 20వార్డులను గెలిచి మరోసారి క్లీన్ స్విప్ చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. పట్టణంలో చేపట్టిన మిషన్భగీరథ, మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తయిన వెంటనే పట్టణాన్ని అభివృద్ధిలో మరో సిద్దిపేటను చేసి చూపిస్తానని భరోసానిచ్చారు. పట్టణంలో 100 పడకల దవాఖాన నిర్మాణం చివరి దశలో ఉన్నదని, ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.
ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్, స్మృతివనం, వ్యవసాయ మార్కెట్ ప్రహరీ విస్తీర్ణంతోపాటు ఎన్టీఆర్, ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న భగీరథ, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను కేంద్ర మంత్రులు సైతం ప్రశంసించినట్లు గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగురేస్తుందన్నారు. 30న జరిగే ఎన్నికల్లో 20వార్డుల్లో బలపర్చిన పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు విప్ గువ్వల సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్రెడ్డి, నరేశ్, రమేశ్, మనోహర్ ప్రసాద్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.