ఊట్కూర్, జూన్ 12: మండలంలో వరిధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండటంతో వాటిని ఆధారంగా చేసుకుని మండల వ్యాప్తంగా రైతులు రికార్డు స్థాయిలో వరి పండించారు. మరో పక్క ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలకు వాహనాలతో తరలివస్తున్నారు. శనివారం పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఊట్కూర్ సింగిల్విండో చైర్మన్ బాల్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటర్ ద్వారా మండలంలో 856 మంది రైతుల నుంచి 1,64,374 బ్యాగుల ధాన్యం, దాదాపు 64,550 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. స్థానిక విజయ కాటన్ మిల్లు గోదాములో ధాన్యం నిలువలు నిండిపోవడంతో తాజాగా మండలకేంద్రంలోని రైతు వేదికలో ధాన్యం బస్తాలను నిలువ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ కార్యదర్శి హుస్సేన్, విద్యాసాగర్, బాబు, తరుణ్ పాల్గొన్నారు.