పల్లెప్రగతితో అభివృద్ధి పరుగులు
శ్మశానవాటిక, డంపింగ్యార్డు నిర్మాణం
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత n ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు
బిజినేపల్లి, జూన్ 11 : మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామం అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. ప్రతి ఇంటి ముందు ఇంకుడుగుంతలు నిర్మించారు. గత జనవరి 26న కలెక్టర్ శర్మన్ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీగా సర్పంచ్ లక్ష్మి అవార్డు అందుకున్నారు. కోడుపర్తిమిట్ట, వట్టెం రిజర్వాయర్లో ముంపునకు గురైన రాంరెడ్డిపల్లి తండాను కలిపి రాంరెడ్డిపల్లి గ్రామపంచాయతీగా నూతనంగా ఏర్పాటు చేశారు. గతంలో గ్రామం మధ్యలో ఉన్న రోడ్డుకు ఒక పక్క ఉన్న వారు బిజినేపల్లి మండలానికి చెందిన ఓటర్లు, మరో పక్క ఉన్న వారు తిమ్మాజిపేట మండలానికి సంబంధించిన ఓటర్లు ఉండేవారు. కానీ, శివారు మాత్రం వట్టెం గ్రామం కిందకు ఉండేది. నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన క్రమంలో రెండు మండలాలకు సంబంధించిన ఓటర్లను, ఇండ్లను, రాంరెడ్డిపల్లి తండాను కలుపుకొని రాంరెడ్డిపల్లి జీపీగా ఏర్పాటు చేశారు.
ఈ గ్రామంలో మొత్తం జనాభా 600లకు పైగా ఉండగా, 480 మంది ఓటర్లు ఉన్నారు. 106 నల్లాలతో మిషన్ భగీరథ నీటిని వంద శాతం సరఫరా చేస్తున్నారు. గ్రామంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. మురుగు కాలువలు లేని గ్రామంగా మండలంలో పేరు పొందింది. పాఠశాల నుంచి రాంలాల్నాయక్ ఇంటి వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. 30 గుంటల విస్తీర్ణంలో కబంద, అశోక, మహాగని, కానుగ, చైనాబాదం, గుల్మోర్ వంటి మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్ నిర్మించారు. అంతేకాక రూ.2.30 లక్షల వ్యయంతో డంపింగ్యార్డు, రూ.12.50 లక్షలతో శ్మశాన వాటికను సుందరంగా నిర్మించారు. హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. వానకాలంలో నాటేందుకు నర్సరీలో 8 వేల మొక్కలు సిద్ధంగా ఉంచారు. వంద స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు బిగించారు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు. మట్టితో ప్రధాన రహదారి వెడల్పు పనులు చేపట్టారు.