శ్రీశైలంలో మూకుమ్మడి దాడులు
దుకాణం దహనం.. వందల వాహనాలు, షాపులు ధ్వంసం
అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు అల్లర్లు
యాత్రికుడికి గాయాలు.. భయాందోళనలో స్థానికులు
పోలీస్ పహారాలో మల్లికార్జునుడి క్షేత్రం
కన్నడిగులు కన్నెర్ర చేశారు. చాయ్ బండి వ్యాపారస్తుడికి, కర్ణాటక భక్తుడికి వాటర్ బాటిల్ డబ్బుల విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారి దుమారం రేపింది. కన్నడ భక్తులు, వ్యాపారుల మధ్య బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు అల్లర్లు కొనసాగాయి. పోలీసులు, ఆలయ నిర్వాహకులు రంగంలోకి దిగి వివాదం
సద్దుమణిగేలా చేశారు. అయితే ఈ ఘటనలో పలు దుకాణాలు, కార్లు ధ్వంసమయ్యాయి. కొన్ని షాపులు దహనమయ్యాయి.
శ్రీశైలం, మార్చి 31 : ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రం బుధవారం అర్ధరాత్రి రణరంగంగా మారింది. శివ పంచాక్షరీ మంత్రం ఆగిపోయి యాత్రికుల హాహాకారాలు.. ఉరుకులు.. పరుగుల శబ్దాలతో ప్రతిధ్వనించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ చాయ్ బండి వద్ద వాటర్ బాటిల్కు డబ్బులు ఇచ్చే క్రమంలో షాపు యజమానికి.. కన్నడ యాత్రికుడి మధ్య వివాదం మొదలైంది. అక్కడే ఉన్న షాపులో పనివాడు జోక్యం చేసుకోవడంతో ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో ఆవేశానికి గురైన షాపువాడు ఫ్రైడ్రైస్ చేసే గంటెతో యాత్రికుడి తలపై కొట్టాడు. వెంటనే భక్తుడిని దవాఖానకు చేర్చి వైద్యం అందించేలోపే విషయం తెలిసిపోయింది. కన్నడీగులు ఆవేశంతో ఊగిపోతూ క్షేత్ర ప్రధాన వీధుల్లో అరుపులు కేకలతో ఆందోళనకు ది గారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచే కా కుండా వివిధ ప్రాంతా ల వారంతా సుమారు 50 వేల మందికిపైగానే క్షేత్రానికి వచ్చారు. వీరంతా రోడ్లు, ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా షాపులో మంటలు ఎగిసిపడడం.. వందల సంఖ్యలో గుంపు లు గుంపులుగా పరుగులు పెట్టడం.. రోడ్లకిరువైపులా షాపులు, తోపుడబండ్లు, పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేస్తూ అడ్డుకునేందుకు వచ్చిన వారిపై దాడులకు దిగారు. బీరప్ప సదనం, కురువ సత్రం ముందున్న టీస్టాల్కు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటినా అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఆలయ ప్రధాన గోపు రం వద్ద, లలితా బజార్, ఈవో ఆఫీస్ లైన్లో ఉన్న షాపుల పరదాలను తొలగించారు. ప్రధాన రోడ్లు కూడళ్లు బస్టాండ్ ప్రాంతాల్లోనే కాకుండా అన్నసత్రాలు, దేవస్థాన సదనాలలో బస చేసిన వారి వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో 200కుపైగా వాహనాల ధ్వంసం చేశారు. ఒకవైపు కన్నడీగులు.. మరోవైపు స్థానిక షాపుల వారు పరస్పరం దాడికి దిగడంతో ఫుట్పాత్లపై ఉండే చిరువ్యాపారులు కూడా తమ వస్తు సామగ్రిని నష్టపోయారు. అర్ధరాత్రి మొదలైన అల్లర్లు గురువారం తెల్లవారే వరకు సాగుతూనే ఉన్నాయి. ఆత్మకూరు డీఎస్పీ శృతి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు దేవస్థాన సెక్యూరిటీ సిబ్బందితో ఆలయ అధికారులు, ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డి పెట్రోలింగ్ చేస్తూ అల్లరిమూకలను చెదరగొట్టారు. ఆలయ పరిసరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులు పహా రా నిర్వహించారు.
వదంతులు నమ్మొద్దు : జగద్గురు పీఠాధిపతి
క్షేత్ర పరిధిలో బుధవారం రాత్రి జరిగిన పరస్పర దాడుల్లో గాయపడిన భక్తుడి ఆరోగ్య పరిస్థితి సా నుకూలంగానే ఉన్నదని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి పండితారాధ్య డాకర్ చెన్నసిద్ధరామప్ప చెప్పారు. కన్నడ, తెలుగు భాషల్లో ఆయన మాట్లాడుతూ అల్లర్లను ప్రేరేపించే విధంగా జరుగుతున్న దుష్ప్రచారాలను వదంతులను నమ్మొద్దన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, డీఎస్పీ శృతి, ఈవో లవన్న మీడియాతో మాట్లాడుతూ మహోత్సవాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.