నాగర్కర్నూల్ : అధికారంలో రావడానికి ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (CPI MLA Sambasivarao ) అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసమే పని చేయడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని ఆయన సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో సీపీఐ ఆధ్వర్యంలో కూనంనేని సాంబశివరావును, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిని, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని సన్మానించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ పేద ప్రజలకు(Poor People) మంచి చేయాలన్నది సీపీఐ సిద్ధాంతం అన్నారు. అందుకోసమే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టామని వెల్లడించారు. ప్రజల కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పేదల సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు కలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి ,సంక్షేమం చేసి చూపించడంలో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.