నాగర్ కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం సర్వే జరుగుతుందని వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అటవీ డివిజన్లలో అడవుల అభివృద్ధి కోసం జరుగుతున్న ఇన్వెంటరీ సర్వే మాత్రమేనని అమ్రాబాద్ ఎఫ్డీవో రోహిత్ తెలిపాడు. అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అడవుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఆయా ప్రాంతాలలో ఇన్వెంటరీ పాయింట్లను ఏర్పాటు చేసి పెరిగిన చెట్లు, పరిసర ప్రాంతాల్లో ఉన్న మట్టిని కూడా తీసుకొని భూమిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ పరిమాణాన్ని కనుగొనడం జరుగుతుందని ఆయన అన్నారు.
అక్కడ పెట్టిన గుర్తులు, చెట్ల కొలతలు నల్లమల అటవీ ప్రాంతంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ విధంగా సర్వే కొనసాగుతుందని వెల్లడించారు. అటవీశాఖలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా యురేనియం కోసం జరిగిన సర్వే అని అనుకోవటం సరికాదని అన్నారు. బయట జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ప్రజలు అభద్రతా భావానికి గురికావద్దని ఆయన సూచించారు.