..‘ఆ ఊళ్లో కోళ్ల పెంపకం ఉండదు.. వాటి కూత వినిపించదు.. ఏ ఇంట్లో చూసినా మంచాలు కనిపించవు.. బంధువులు ఎవరొచ్చినా అక్కడి వారితో కలిసి కింద పడుకోవాల్సిందే.. గుర్రపు స్వారీ అసలే ఉండదు.. మట్టి కుండలూ ఇక్కడ నిషేధమే’.. మీరు చదువుతున్నది నిజమే.. ఈ ఆచారం కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా మైలాపూర్లో అమలవుతున్నది. వినడానికి వింతగా ఉన్నా.. అనాధిగా ఇదే కొనసాగుతున్నది. నారాయణపేట జిల్లా కేంద్రానికి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో వెలిసిన మల్లయ్య స్వామి అంటే స్థానికులకు ఎంతో భక్తి, గౌరవం.. అందుకే స్వామికి నచ్చని పనులు 350 ఇండ్లల్లో నివాసం ఉండే 3 వేల మంది జనాభాలో ఏ ఒక్కరూ చేయరు.. ఇలా వందల ఏండ్లుగా సంప్రదాయం సాగుతున్నది. అంతటి మహిమాన్విత క్షేత్రం కాబట్టే మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కురుమ, యాదవులు, ఇతర కులస్తులు లక్షల్లో వెళ్లి స్వామిని దర్శించు కుంటారు. ఇక్కడ ప్రతి సంక్రాంతి పండుగ రోజు జాతర నిర్వహిస్తుంటారు.
– నారాయణపేట, జనవరి 14
ఆ ఊరిలో కోడి కూయదు.. ఇంట్లో మంచాలు ఉండవు.. అంతే కాదండీ గుర్రపు స్వారీ చేయడం.. మట్టి కుండలు తయారీ చేయడం ఉండదు.. వినడానికి వింతగా ఉన్నా.. అనాధిగా వస్తున్న సంప్రదాయాన్ని గ్రామస్తులు నేటికీ కొనసాగిస్తున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాలో మైలాపూర్ గ్రామం గురించే ఇదంతా.. ఈ గ్రామంలో 3 వేల వరకు జనాభా ఉన్నది. 350 ఇండ్లు ఉంటాయి. గ్రామానికి అనుకొని ఉన్న గుట్టపై మల్లయ్య స్వామి ఆలయం కొలువై ఉంటుంది. ఈ ఆలయానికి మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. ఆలయం, గ్రామం గురించి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
మకర సంక్రాంతి పర్వదినాన జరిగే మైలాపూర్ మల్లయ్య స్వామి జాతర వేడుకలు హైదరాబాద్-కర్ణాటక డివిజన్లోని జిల్లాల్లో అతి పెద్దదిగా చెప్పొచ్చు. హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగి.. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న జిల్లాలను ఆ రాష్ట్రంలో హైదరాబాద్-కర్ణాటక డివిజన్ పరిధిలోని జిల్లాలుగా పిలుస్తుంటారు. వీటిలో కలబుర్గి (గుల్బర్గ), రాయిచూర్, కొప్పల్, బళ్లారి, బీదర్, యాద్గీర్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో జరిగే అతి పెద్ద జాతర ఇదే కావడం విశేషం. కురమ, యాదవుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న మల్లయ్య స్వామిని దర్శించుకోవడానికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కేవలం ఒక్క జాతర రోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు నెల రోజుల నుంచే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంటారు.
ఏటా మకర సంక్రాంతి రోజున మల్లయ్య స్వామి జాతర ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. అదేరోజు స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఎంతో కనులపండువగా జరిగే కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. జాతర రోజున స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని కోనేరు వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చి స్నానాది కార్యక్రమాలు నిర్వహించి కల్యాణాన్ని జరిపిస్తారు. ఈ సందర్భంగా భక్తులు బండారు (పసుపు) చల్లుతారు. ఇదే సందర్భంలో భక్తులు తమ మొక్కుబడులుగా గొర్రెలను స్వామి వారికి కానుకలుగా సమర్పిస్తారు. భక్తులు పలు ప్రాంతాల నుంచి పాదయాత్రగా కూడా వస్తుంటారు. చాలా మంది భక్తులు నైవేద్యాలు సమర్పిస్తారు. జాతర కోసం కర్ణాటక, తెలంగాణ నుంచి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు.
మా గ్రామంలోని గుట్టపై వెలసిన మల్లయ్య స్వామికి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు. స్వామినిభక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతా శుభం చేకూరుతుంది. మహిమానిత్వం కలిగిన కోనేరులో స్నానాలు చేసి స్వామినిదర్శించుకుంటే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతిన నిర్వహించే జాతర, అమావాస్య రోజుల్లో భక్తులు భారీగా తరలివస్తుంటారు. గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారాలను తూచా పాటిస్తున్నాం. మా గ్రామంలో స్వామి వారికి ఇష్టం లేని పనులు ఏవీ చేయం. కోడి కూత ఇష్టం లేనందునే కోళ్లను పెంపకం జరగదు. స్వామి వాహనం గుర్రం కావడంతో గుర్రపు స్వారీ చేయం.
– శాంతమ్మ, మైలాపూర్ గ్రామవాసి
మైలాపూర్ గ్రామంలో 350 ఇండ్లు ఉంటాయి. 3 వేల వరకు జనాభా ఉంటుంది. గ్రామం మొత్తంలో కేవలం మల్ల య్య స్వామి ఆలయం మాత్రమే ఉం టుంది. ఆయన తప్పా గ్రామంలో ఏ దేవు డూ కనిపించడు. ఊరి ప్రజలందరూ మల్ల య్య స్వామినే కొలుస్తారు. కొండ కింద కోనేరు ఉంటుంది. మహిమానిత్వమైన ఈ కోనేరులో స్నా నాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. 105 మెట్లు ఎక్కి కొం డపై వెలిసిన మల్లయ్య స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. కొండపై గల రాతి గుహల మధ్య స్వామి వారు కొలువై ఉంటారు. చిన్న గుహ కావడంతో ప్రతి భక్తుడూ తప్పనిసరిగా తలదించుకొని వెళ్లాల్సిందే. స్వామి వారి భార్యలైన తురంగి బాలమ్మ, గంగి మాలమ్మల విగ్రహాలు కూడా స్వామి వారి విగ్రహం పక్కన కొలువై ఉంటాయి.
మల్లయ్య స్వామికి కోడి కూత నచ్చదన్న నమ్మకంతో మైలాపూర్ గ్రామంలో కోళ్ల పెంపకం చేపట్టరు. గ్రామం మొత్తం వెతికినా ఒక్క కోడి కూడా కనిపించదు. ఒకవేళ గ్రామస్తులు కోడికూర తినాలంటే గ్రామం బయటే ఆరగించి రావాలి తప్పా గ్రామంలోకి తీసుకురాకూడదు. మంచాలపై పడుకుంటే స్వామి వారికి గౌరవం ఇచ్చినట్లు కాదని, అందువల్లే నేలపై చాప కానీ, పరుపు కానీ వేసుకొని నిద్రిస్తారు. నేటికీ ఆ గ్రామంలో ఒక్క మంచం కూడా ఉండదు. గర్భిణులు సైతం నేలపైనే పడుకుంటారు. స్వామి వాహనం గుర్రం కావడంతో, గ్రామస్తులు ఎవ్వరూ గుర్రపుస్వారీ చేయరు. మట్టి పాత్రల తయారీ కూడా నిషేధం ఉన్నది. ఈ ఆచారాలను మైలాపూర్ వాసులు వందల ఏండ్ల నుంచి ఆచరిస్తూ వస్తున్నారు.