మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్ర చారం సోమవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారాలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకున్నారు. సవాళ్లు, విమర్శనాస్ర్తాలతో మున్సిపల్ ఎన్నికల వేడిని రగిలించారు. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్తో పాటు 18 మున్సిపాలిటీలో ఎక్కడికక్కడే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో ఓటర్ల ను ఆకట్టుకున్నారు. ప్రచారం ముగియడం తో ఇక ప్రలోభాలపై దృష్టి సారించారు.
మ రోవైపు పోలీసులు మున్సిపల్ ఎన్నికలు జరి గే ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుం డా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. సర్వం సిద్ధం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కార్పొరేషన్తో పాటు 18 మున్సిపాలిటీలకు పోలి ంగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఆయా జిల్లా కలెక్టర్లు దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ.. పోలింగ్ సిబ్బం ది కేటాయింపు జరిగిపోయింది. మున్సిపాలిటీలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా ఓటరు స్లిప్పులను కూడా పంపిణీ చేశారు.
కేంద్రాల వద్ద ఓటర్లకు సహాయం చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్కు మరో 24 గంటలు సమయం ఉండడంతో పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం తగిన బందోబస్తు ఏర్పాటు చేసింది. జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ చౌహన్ ఆధ్వర్యంలో ఆయా జిల్లా ఎస్పీలు దగ్గరుండి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే అవసరమైన పోలీసు సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరుతున్నారు.