వనపర్తి, ఏప్రిల్ 16: వనపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు ప్రభుత్వ దవాఖానలో పిల్లల వైద్యులు ప్రత్యేకంగా ఉండేవారు కాదు. ఒకవేళ ఉన్నా వారంలో ఒకట్రెండ్లు రోజులు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటే గగనం. నవజాత శివుతులతోపాటు చిన్నారులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేట్ దవాఖానల్లో టోకెన్లు తీసుకొని సాయంత్రం వరకు క్యూలైన్లో వేచి ఉండే పరిస్థితి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాకేంద్రంలోని నర్సింగాయపల్లి శివారులో మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఈ దవాఖాన అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రసవాలు, సర్జరీలు చేయడంతోపాటు నవజాత శిశువులు, చిన్నారులకు ప్రత్యేక డా క్టర్లు 24 గంటలు అందుబాటులోకి వచ్చారు.
కార్పొరేట్ తరహా వైద్యం
మాతా, శిశు సంరక్షణకేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్యూ కేర్ సెంటర్ నవజాత శిశువుల పాలిట సంజీవనిలా మారింది. కార్పొరేట్ దవాఖానలో రూ.లక్షలు వెచ్చించినా లభించని వైద్యం ఈ కేర్ సెంటర్లో ఉచితంగా అందుతున్నది. ఒకేసారి 20మంది శిశువులకు వైద్యం అందించేలా పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా నవజాత శిశువులు ఉమ్మునీరు తాగినా, ఊపిరి సరిగ్గా తీసుకోకపోయినా, ఎక్కువ బరువుతో పుట్టినా, ఊపిరితిత్తుల సమస్య తలెత్తినా ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా పుట్టిన శిశువు ఉష్ణోగ్రతను సాధారణం చేయడానికి, హైడ్రోథెరఫీ యూనిట్లతో కామెర్లు వంటి వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు చిన్నారుల్లో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి రేడియంట్ వార్మర్లను సైతం ఉపయోగిస్తున్నారు. నవజాత శిశువులతోపాటు చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో జిల్లాకేంద్రంతోపాటు సమీప మండలాలు, గ్రామాల వారు సేవలను అందిపుచ్చుకుంటున్నారు. 28 ఫిబ్రవరి 2022 నుంచి నేటి వరకు 1,640 మంది నవజాత శిశువులకు వైద్యం అందించారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో కాన్పులు చేసిన 1,558మంది, ఇతర దవాఖానల నుంచి వచ్చిన 82మంది శిశువులకు మొత్తంగా 1,640మందికి వైద్యం అందించారు. ఈ కేర్ సెంటర్లో ప్రొఫెసర్, హెచ్వోడీ డిపార్ట్మెంట్ పీడియాట్రిక్ డాక్టర్, కేర్ సెంటర్ ఇన్చార్జి ప్రొఫెసర్ డాక్టర్ చంద్రమోహన్తోపాటు ముగ్గురు పిల్లల డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటున్నారు.
సేవలను వినియోగించుకోవాలి
మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువు, చిన్నారుల కోసం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రసుత్తం 20మంది నవజాత శిశువులకు ఏక కాలంలో వైద్య సేవలు అందిస్తున్నాం. ఎస్ఎస్సీయూ కేర్ సెంటర్ ద్వారా అందించే సేవలకు ప్రైవేట్ దవాఖానలో అయితే భారీగా ఖర్చువుతుంది. కానీ ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తున్నాం.
– నరేందర్కుమార్, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ దవాఖాన, వనపర్తి
24 గంటలు అందుబాటులో..
నవజాత శిశువులకు ఎస్ఎన్సీయూ సెంటర్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తున్నాం. మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో జన్మించిన వారే కాకుండా ఇతర దవాఖానల్లో పుట్టి సమస్యతో ఇక్కడికి వచ్చే వారికి కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నాం. ప్రైవేట్లో వృథాగా డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ దవాఖాల్లో అందిస్తున్న వైద్య సేవలను అందిపుచ్చుకోవాలి.
– బంగారయ్య, ఆర్ఎంవో, మాతా, శిశుసంరక్షణ కేంద్రం, వనపర్తి