వ్యవసాయమే జీవనాధారంగా ..కుటుంబమే జీవితంగా బతుకుతున్న రైతన్నలకు సర్కార్ పెద్దపీట వేస్తున్నది. పెట్టుబడికి సాయం అందిస్తూ..ఎరువులు, విత్తనాలు సబ్సిడీ ఇస్తూ పంటకు మద్దతు ధర కల్పిస్తూ అండగా నిలుస్తున్నది. ఏదైనా కారణంతో ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోతుంది. బాధిత కుటుంబాలు పడే బాధను తీరుస్తూ వారికి భరోసానిస్తూ బీమా అందిస్తున్నది సర్కార్. పది రోజుల్లోనే బాధిత ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ పారదర్శకంగా నిలుస్తున్నది.
– మక్తల్ టౌన్, ఆగస్టు 25
రైతుబీమా పథకం అన్నదాత కుటుంబాల్లో కొండంతా భరోసాను నింపేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో నారాయణపేట జిల్లాలో 2,894 కుటుంబాల్లో భరోసా నింపింది. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున రూ. 144.70 కోట్ల సొమ్మును ప్రభుత్వం అందించింది. జిల్లాలోని 11మండలాల వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం లక్షా 75 వేల మంది రైతులు ఉన్నారు. బీమా పథకానికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన రైతులను ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. దీంతో లక్షా 15 వేల 763 మందికి బీమా పాలసీ పొందిఉన్నారు.
రైతుకు బీమా ఎక్కడాలేదు..
పూర్తి పారదర్శకతతో మొట్టమొదటి సారిగా రైతు బీమా పథకం ద్వారా రైతుల నామినీ ఖతాలోకి రూ. 5 లక్షలు జమకావడం జీవితంలో మొదటి సారిగా చూస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో రైతులు మరణిస్తే వారు అర్హులని తేలడానికే సంవత్సరాల కాలం పట్టేది. తెలంగాణ ప్రభుత్వంలో రైతుబీమా పథకంతో 10రోజుల్లోనే బాధిత కుటుంబానికి డబ్బులు అందుతున్నాయి.
– డీఏవో సుధాకర్, నారాయణపేట
పదిరోజుల్లోనే డబ్బులు అందాయి
రైతు బీమా పథకం ద్వారా అందించే రూ. 5లక్షలు పది రోజుల్లోనే నా ఖాతాలో జమ అయ్యింది. నా భర్త శ్రీనివాసులు విద్యుత షాక్తో చనిపోయాడు. మాకు సొంత ఇల్లు కూడా లేదు. దిక్కు తోచని స్థితిలో ఉన్న మాకు బీమా డబ్బుతో భరోసా వచ్చింది. ఆ డబ్బులతోనే సొంతిళ్లు కట్టుకున్నాం.
– సునీత, పంచలింగాల, మక్తల్
ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వలే..
సర్కార్ బీమా పథకంతోని ఇచ్చే పైసలు మొత్తం నా ఖాతాలోనే పడ్డాయి. నేను ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. మా ఇంటాయన పాణం బాగాలేక కాలం చేసిండు. పెద్దదిక్కు కోల్పోయి మాకు సర్కార్ బీమా పైసలు ఇచ్చి ఆదుకున్నది. కొంత బాకీ ఉంటే తీర్చినం. మిగిలిన పైసలు పొలం పనులకు వాడినం.
– వెంకటమ్మ, ఓబ్లాపురం, మాగనూర్