గద్వాల, డిసెంబర్ 9: తెలంగాణలోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో రిలే నిహారదీక్ష చేస్తున్న వాల్మీకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ .. ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్కు వాల్మీకి బోయల కష్టసుఖాలు తెలుసని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసి ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. గతంలోనే అసెంబ్లీ సమావేశంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని, సాంకేతిక కారణాలతో బిల్లు వెనక్కి వచ్చిందన్నారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు వాల్మీకుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వాల్మీకులను తప్పుదారి పట్టిం చే ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. వాల్మీకి బోయలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్ర భుత్వంపై పూర్తి విశ్వాసంతో దీక్ష విరమించడం సంతోషకరమన్నారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి బిల్లు చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు.
నాలుగు రోజుల కిందట మహబూబ్నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వాల్మీకులకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ జంబురామన్గౌడ్, ఉమ్మడి జిల్లా కేటీఆర్ యువసేన ప్రధానకార్యదర్శి కృష్ణకుమార్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోవిందు, వాల్మీకి ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు వైండింగ్ రాములు, నియోజకవర్గ అధ్యక్షుడు కోటేశ్, ప్రధాన కార్యదర్శి మురళి, వాల్మీకి నాయకులు రమేశ్ నాయుడు, హన్మంతు నాయుడు, వీరన్న, వెంకటన్న, సవారన్న, రఘు నాయుడు, శేషునాయుడు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్తో కార్పొరేట్ దవాఖానల్లో సామాన్యులకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ధరూర్ మండలం, పెద్దపాడు గ్రామానికి చెందిన శివన్న చికిత్స నిమిత్తం రూ.34వేలు సీఎం సహాయనిధి ద్వారా విడుదలైన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ్భాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు.