అలంపూర్, జూన్ 27 : ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ఉంటూ పాలకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించినా ప్రాజెక్టులపై వివక్ష వీడడం లేదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ సభ్యులు,అలంపూరు జేఏసీ చైర్మన్ రామ్మోహన్, పాలమూరు అధ్యాయన వేదిక కో కన్వీనర్ గద్వాల జిల్లా అధ్యక్షుడు హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించి పనులు త్వరగా పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని వారు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 1978లో ఆర్డీఎస్పై బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పు ప్రకారం కేటాయించిన 15.9టీఎంసీల నీటి వాటా అందడం లేదని,1981లో నిర్మాణం ప్రారంభించి 1996 నుంచి నీరు విడుదలవుతున్న జూరాల డ్యాంలో సిల్ట్ పేరుకు పోయిందని, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా 1,2 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, రీ డిజైన్తో పనులు ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో సగం కూడా పూర్తి కాలేదన్నారు. జిల్లాలో ఇలా చాలా వరకు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని గుర్తు చేశారు.
సాగునీటి వినియోగ సమస్యల పరిష్కారం కోసం ఇరిగేషన్ కమిషన్ లేకపోవడం అవగాహన రాహిత్యమే అన్నారు. కాంట్రాక్టర్ల ప్రమేయంతో ప్రాజెక్టు పరిస్థితి మరింత గందర గోళంగా మారిందన్నారు. ఇలాంటి అసమానతలు తొలగించి ప్రాజెక్టుల పెండింగ్ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతం చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నిషాక్, ఎండీ బాషా, గోపాల్రెడ్డి, ఆంజనేయులు, విజయ భాస్కర్రెడ్డిలతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.