నాగర్కర్నూల్, జనవరి 13 : ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కనిపించకపోగా.. అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగంపై ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలకు కులానికి ముడిపెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బిజినేపల్లి మండలంలో నిర్మించనున్న మార్కండేయ లిఫ్ట్నకు అడ్డుకట్ట వేసేందుకే పరిశీలించడానికి పోయా వా.. అని మండిపడ్డారు. మార్కండేయ లిఫ్ట్ గురించి నీకు తెలుసా.. అని నిలదీశారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్రా అడ్వకేట్లను తీసుకెళ్లావా..? లేదా అడ్డుకునేందుకు కాకుండా కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నావన్నారు.
ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సింది ఉంది.. అంతా చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. పాదయాత్ర సందర్భంగా ఎస్టీలు అడిగినందుకే రూ.80 కోట్ల తో మార్కండేయ రిజర్వాయర్కు రూపకల్పన చేశామన్నారు. తాము ప్రజలకు వాస్తవాలు చెబుతామని, నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హితవు పలికారు. మేం తిరగబడితే నాగర్కర్నూల్లో తిరగలేవని నాగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాగం’ నీవు పాములా కాటు వేస్తుంటే.. నేను ‘మర్రి’ చెట్టులా నీడనిస్తా.. అన్నారు. అవినీతిపై చర్చించడానికి వేదిక నీవు డిసైడ్ చేస్తవా.. అని సవాల్ విసిరారు.
40 ఏండ్లలో ఎంత మంది ఎస్సీ, ఎస్టీల అమ్మాయిల పెండ్లిండ్లు చేశావు.. ఎన్ని స్కూళ్లు కట్టించావు.. హెల్త్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో మెడికల్ కళాశాలను ఎందుకు తీసుకురాలేదన్నారు. తెలంగాణ వచ్చాక నేను ఎమ్మెల్యేగా ఉండి వైద్య కాలేజీని తీసుకొచ్చానన్నారు. రేపటి ఎన్నికల్లోనూ గెలిచేది నేనే, గెలిచిన తర్వాత ఇంజినీరింగ్ కళాశాలను తీసుకొస్తానన్నారు. దమ్ముంటే నాపై పోటీ చేయి.. నీవు పెట్టుకునే రేపటి మీటింగే లాస్ట్ అవుతుంది నీకు అని హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానలో నీ హయాంలో ఎందరు డాక్టర్లు ఉండేవారు.. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారో ఒకసారి తెలుసుకో అని హితవు పలికారు. నల్లమట్టి అమ్ముకున్నట్లు ఆధారాలు చూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, నీకే మద్దుతిస్తానని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసు పెట్టింది నీవు కాదా.. అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో నేను గెలిస్తే పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేస్తా, స్కూళ్లను కట్టిస్తా, నీవు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలని నిలదీశారు. నాపై నీవే పోటీ చేయాలని అప్పుడే మంచి కిక్ ఉంటుందన్నారు. కేసీఆర్ను విమర్శించే హక్కు నీకు లేదు, ఆయన ముందు నెవ్వెంత అన్నారు. రైతులకు నీళ్లు తెచ్చాం.. విద్యార్థుల ఉన్నత చదువులకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాను.. నీవేమి తెస్తావో చెప్పాలన్నారు. ప్రతిసారి నన్ను వ్యాపారిగా సంబోధిస్తుంటావు.. నేను బట్టలోడినే.. నాకు బట్టలను కట్టడం తెలుసు, విప్పడమూ తెలుసు.. నాతో పెట్టుకోవద్దు అని హెచ్చరించారు.
మీరు పెట్టే మీటింగ్కు డబ్బులు ఎవరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 21 సీట్లు దాటి రావని, వస్తే నేను రాజీనామా చేస్తానని మర్రి సవాల్ విసిరారు. దేశంలో కాంగ్రెస్ పనైపోయింది. 50 ఏండ్ల చరిత్రంలో ఏం అభివృద్ధి చేశారని కాంగ్రెస్కు ప్రజలు ఓటేయాలో చెప్పాలన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, మున్సిపల్ చైర్మన్ కల్పన, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.