జడ్చర్లటౌన్, జూన్ 14 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. అనంతరం న్యూట్రిషన్ కిట్లు, బీపీ పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
అలాగే ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేయడంతోపాటు నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన డాక్ట ర్లు, వైద్యసిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ పూర్తిగా కుంటుబడి.. సర్కారు దవాఖానలంటే ప్రజల్లో మరో భావన ఉండేదన్నారు. అప్పట్లో ఎర్రగోలి, పచ్చగోలి తప్ప సరైన వైద్యం అందేదికాదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో వైద్యశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల, బస్తీ దవాఖానలు, టీ డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు, దవాఖానల అప్గ్రేడ్తో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు. కార్పొరేట్ స్థాయిలో సర్కారు దవాఖానల్లో వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి ఏరియా దవాఖానలో ఐసీయూ, పిల్లల ఐసీయూలు ఏర్పాటు చేశారన్నారు. దేశంలోనే మొదటిసారిగా సింగిల్యూజ్ ఫిల్టర్తో డయాలసిస్ చేసేలా 40 సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటైనట్లు తెలిపారు. టీ డయాగ్నస్టిక్ సెంటర్లలో 55 రకాలకుపైగా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారన్నారు. అన్ని ఏరియా దవాఖానలు, పీహెచ్సీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు ఆరో గ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో సర్కారు దవాఖానలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 10వేలమందికి సీఎం సహాయనిధి అందజేసినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకుగానూ జడ్చర్లలో అధునాతన సదుపాయాలతో వందపడకల దవాఖాన ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. మున్సిపాలిటీలో కొత్తగా 5 అర్బన్ హెల్త్సెంటర్లు, 50 పడకల క్రిటికల్ కేర్ దవాఖాన మంజూరైనట్లు తెలిపారు. మున్సిపాలిటీలోని పాత కమ్యూనిటీ దవాఖాన యథావిధిగా కొనసాగించేందుకు ఇద్దరు వైద్యులను నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే బాలానగర్లో 30పడకల దవాఖాన ఏర్పాటు చేశామన్నారు.
పెద్ద ఆదిరాల, ఊర్కొండ గ్రామాల్లో కొత్తగా పీహెచ్సీలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ సీఈవో జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ సుదర్శన్గౌడ్, ఎంపీపీ సుదర్శన్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శంకర్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ సోమశేఖర్, వైద్యాధికారులు జరీనాభాను, శివకాంత్, మనుప్రియ, సమత, సృజన, విజయలక్ష్మి, మధుసూదన్, సునీల్, హరీశ్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.
భక్తిభావం అలవర్చుకోవాలి
బాలానగర్, జూన్ 14 : ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ గాలిగూడలో బుధవారం బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి బొడ్రాయిని ప్రతిష్ఠించారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామదేవత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభు త్వం సర్వమతాలను గౌరవిస్తుందని, ప్రసిద్ధి ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందరూ కలిసికట్టుగా బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఉత్సవాల నిర్వహణకు జెడ్పీటీసీ జర్పుల కల్యాణి రూ.25వేల విరాళం అందజేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ వెంకటాచారి, బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, గిరిజన నాయకుడు లక్ష్మణ్నాయక్, సింగిల్విండో డైరెక్టర్లు మంజూనాయక్, నాగిరెడ్డి, సర్పంచ్ రాంరెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షు డు నర్సింహులుయాదవ్, వస్పుల యాదయ్య పాల్గొన్నారు.