అచ్చంపేట, నవంబర్ 10: తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని అవమానించి పారిపోయిన తెలంగాణ ద్రోహి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అని, డబ్బులు, భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని టికెట్లు అమ్ముకుంటున్న ఆయన్ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉన్న అచ్చంపేటను ఆగం చేసేందుకు వస్తున్న దోపిడీదారులు, హైదరాబాద్లో ఉండే పెత్తందారులు కావాలా? అచ్చంపేటను అభివృద్ధిలో పరుగులు పెట్టించి ప్రతిగుంటకు సాగునీరు తీసుకొచ్చి పచ్చబడే అచ్చంపేట కావాలా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అచ్చంపేటలో శుక్రవారం ఆయన భార్య గువ్వల అమల, బీఆర్ఎస్ నాయకులు తులసీరాం, అమినొద్దీన్, బంగారు నర్సింహతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు అన్ని మండలాల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 20 వేల మంది తరలిరాగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ అచ్చంపేటలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, పోలింగ్ ఎప్పుడొస్తుందా కారు గుర్తుకు ఓటేసేందుకు అచ్చంపేట ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెయ్యని అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమైందని వివరించారు. నిన్న అచ్చంపేటలో ఒకాయన మాట్లాడున్నాడు మేమే అన్ని చేశామని గొప్పలు చెబతున్న అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏమీ చేయకుండా మొత్తం దోచుకుతిన్నారని విమర్శించారు.
వైద్యం పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే రాజకీయం చేస్తూ, ఆ తర్వాత హాస్పిటల్ పేరుతో పేద ప్రజల కడుపుకోతలు పెట్టి డబ్బులు దండుకుంటున్నారని, అలాంటి వారిని రాజకీయ పరంగా పాతర పెట్టాలని కోరారు. అచ్చంపేట ప్రాంతానికి మంచి చేసే వారికి సహకరించాలని అడ్డుకోవాలని చూస్తే ఆగమైపోతారన్నారు. వేలాది మంది కదిలిన గులాబీ సైనికులను చూసి కాంగ్రెసోళ్లకు భయం పట్టుకుందన్నారు. నా భిక్షతో ప్రజాప్రతినిధిగా చేస్తే పెనిమిళ్లకు నా సతీమణి గువ్వల వెళ్లితే లైట్లు బంద్ చేసి దాడి చేసేందుకు కుట్ర చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. నాభిక్షతో గెలిచి పార్టీమారి విర్రవీగేవారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. నిన్న కాంగ్రెస్కు రెండువేల మంది వస్తే విర్రవిగిన వారు ఈ రోజు అచ్చంపేట జనసంద్రంగా మారిన గులాబీ సైన్యాన్ని చూసి ముఖం ఎక్కడపెట్టుకుంటారని ప్రశ్నించారు. అచ్చంపేటలో 50వేల మెజార్టీతో గులాబీ జెండా ఎగురవేసి తీరుతామని, ప్రజలు కూడా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ప్రకటించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, మారెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, కౌన్సిలర్లు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, చైర్మన్లు, నాయకులు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అచ్చంపేటరూరల్/బల్మూర్, నవంబర్ 10 : శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్తిగా పోటీ చేస్తున్న ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండలంలోని ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమామహేశ్వరస్వామిని తల్లిదండ్రులు గువ్వల ఎల్లమ్మ- రాములు,సతీమణి గువ్వల అమలతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అర్చకుల ఆశీర్వదం తీసుకున్నారు. నిరంజన్షేక్షావలి దర్గాలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదే విధంగా జినుకుంట కనకాల మైసమ్మ ఆలయంలోనూ పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేయడానికి బీఆర్ఎస్ నేతలతో కలిసి అచ్చంపేటకు బయలుదేరారు.