అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి మలివిడుత నిధులు మంజూరయ్యాయి. గత జూన్లో తొలివిడుతగా ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల చొప్పున విడుద లయ్యాయి. రెండో విడుతగా రూ.1.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటుగా ముగ్గురు ఎమ్మెల్సీలకు కలిపి రూ.22.50 కోట్లు మంజూరయ్యాయి. దీంతో గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులు విడుదలయ్యాయి. దీంతో గ్రామాల్లో కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు త్వరగా పూర్తికానున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో గ్రామాలు, పట్టణాల్లోని సమస్యలకు పరిష్కారం లభించనున్నది.
ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభివృద్ధి పనులపై గ్రామాల్లో పలువర్గాల ప్రజలకు హామీలు ఇచ్చారు. వెంటనే పనులు చేపట్టేందుకు తమ నిధుల కోసం ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం నిధుల మంజూరుకు అనుమతించింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి అభివృద్ధి నిధుల కింద 2010నుంచి సీడీపీ నిధులు విడుదలవుతున్నాయి. 2021 ముందు ఏడాదికి రూ.3 కోట్ల నిధులు ఉండగా తెలంగాణ ప్రభుత్వం 2021-2022నుంచి రూ.5కోట్లను అభివృద్ధి నిధుల కింద కేటాయిస్తున్నది.
ఇందులో రూ.2 కోట్లు మనఊరు -మనబడి పథకానికి చెందుతాయి. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల్లో భవనాలు, కిచెన్షెడ్లు, టాయిలెట్లు, ఫర్నిచర్, డిజిటల్ తరగతుల నిర్వహణకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. కాగా, మిగిలిన రూ.3కోట్లతో సాధారణ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ నిధుల్లో 50శాతం మేరకు తొలి విడుతగా ప్రభుత్వం గతేడాది జూన్లో రూ.150కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రతి ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీకి రూ.1.50కోట్లను అభివృద్ధి పనులకు కేటాయించారు.
ఇక మిగిలిన రూ.1.50కోట్ల నిధులను ఇటీవలే విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కాగా, విడుదలైన నిధు ల్లో 10శాతం రూ.30లక్షలు తెలంగాణ గ్రీన్ఫండ్ కిందికి వర్తిస్తుంది. హరితహారంలో భాగంగా వ్యాపార సంస్థలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వం హరితనిధి కింద వసూలు చేస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుంచి కూడా హరితహారానికి కేటాయించనుండటం గమనార్హం. ఈ నిధులతో పార్కులను, అటవీ విస్తీర్ణం పెంపు, పచ్చదనం పెంచేందుకు ఉపయోగించడం జరుగుతుంది. ఇలా తొలి విడుతలో చేపట్టిన పనులు పూర్తయ్యాక మరో విడుతగా రూ.1.50కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయించనుండటం గమనార్హం.
జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కింద విభజించడం జరిగింది. ఎస్సీ నిధులను దళితవాడల్లో, ఎస్టీ నిధులను తండాల్లో, జనరల్ నిధులను మిగిలిన ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు వెచ్చిస్తారు. ఇలా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం నిధులు మంజూరు కావడంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో సమైక్యపాలనకంటే భిన్నంగా ఎమ్మెల్యేలు వారంలో మూడు, నాలుగు రోజులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనుల్లో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు.
అలాంటి నేపథ్యంలో ఈ నిధులతో సీసీరోడ్లు, తాగునీటి బోర్లు, టాయిలెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వీధిదీపాలు, అంగన్వాడీలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కాల్వలు, కమ్యూనిటీహాళ్లు, బస్టాండ్ తదితర 98రకాల పనులు చేపట్టేందుకు ప్రజాప్రతినిధులకు ఊరట కల్పించనున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోని నలుగురు ఎమ్మెల్యేలకు రూ.1.50కోట్ల కింద రూ.6కోట్లు, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్నకు రూ.1.50కోట్ల చొప్పున రూ.4.50కోట్లు కలిపి జిల్లాకు రూ.10.50కోట్లు మంజూరవడం విశేషం.