దేవరకద్ర, నవంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఉత్తమాటే అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. కర్ణాకట ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలను విస్మరించిందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మండలంలోని జీనుగరాల గ్రామంలో వేసవి వచ్చిందంటే ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేవారని, నేడు మిషన్భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరందిస్తుండడంతో మహిళలకు కష్టాలు తొలిగాయన్నారు.
వెంకటాయపల్లి గ్రామంలో 65 మంది పేదలకు ఇండ్లు మంజూరు చేశామని, ఇంకా మిగిలిన 20 మందికి గృహలక్ష్మి కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఓట్ల రాజకీయాలు చేయడంతో కొత్త బిచ్చగాళ్లు గ్రామాల్లోకి వస్తుంటారని, వారికి కారు గుర్తుకే ఓటేస్తామన్న విషయాన్ని తెగేసి చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాయన్నారు. వాగులపై చెక్డ్యాంలు నిర్మించడంతో గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ సుజాత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరసింహారెడ్డి, సర్పంచులు ఆంజనేయులు, శ్యాంసుందర్రెడ్డి, ముడా డైరెక్టర్ రాజు పొల్గొన్నారు.