హన్వాడ, సెప్టెంబర్ 29 : గతంలో పీఎం మోదీ పాలమూరు పర్యటనకు వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాకే ఈ గడ్డపై కాలు పెట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఎల్లబాయితండా, షేక్పల్లి, కిష్టంపల్లి, గొండ్యాల, కిష్టంపల్లిగేటు తండా, ఎర్రగట్టు తండా, మునిమోక్షం, అమ్మాపురం, నాగంబాయింతండా, మాదారం, యారోనిపల్లిలో రూ.28కోట్లతో 41 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ మూడుసార్లు పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా ఇస్తామని పీఎంతోపాటు దివంగత సుష్మాస్వరాజ్, అమిత్షా కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కృష్ణా జలాలను ఎందుకు పంపిణీ చేయడం లేదని విమర్శించారు. పాలమూరు గడ్డపై కాలు పెట్టే ముందు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లోనూ తీర్మానం చేయాలని, ఎస్సీ, బీసీ బిల్లులకు కూడా ఆమోదం తెలుపాలన్నారు. మండలంలోని 16 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుసున్నాయన్నారు.
రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, అందుకోసమే నిరంతర విద్యుత్, రైతుబీమా, రైతుబంధు ఇస్తున్నామని వివరించారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికీ నల్లాతో శుద్ధజలం అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయనిర్మల, రమణారెడ్డి, ఎంపీపీ బాలరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మి, సింగిల్విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తహసీల్దార్ కిష్టానాయక్, ఏపీఎం సుదర్శన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, కార్యదర్శి శివకుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.