మహబూబ్ నగర్: చేనేత కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే కేంద్రంలోని బీజేపి సర్కారు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అన్యాయమని రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సమైక్య రాష్ట్రంలోనూ చేనేత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి చేనేతను బతికించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవాలను జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… చేనేత వంటి చేతి వృత్తులు నాగరికతను నేర్పిన పవిత్రమైన వృత్తులని ఆయన తెలిపారు. నేత కార్మికులు లక్షల ఏళ్లుగా దుస్తులు నేస్తుండడం వల్లే మనం ధరించేందుకు దుస్తులు ఉన్నాయన్నారు. యంత్రాల ద్వారా దుస్తులు నేయడం ప్రారంభమవ్వడంతో నేతన్న ఉపాధికి గండి పడిందన్నారు. సమైక్య పాలకులు చేనేతను ఆగం చేస్తే.. తెలంగాణ వచ్చాక లక్షలాది బతుకమ్మ చీరలు నేసేందుకు కార్మికులకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని మంత్రి తెలిపారు. రైతు బీమా మాదిరిగానే చేనేత కార్మికులకు సైతం ఏ విధంగా మృతి చెందినా రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నామన్నారు.
తెలంగాణ వచ్చాక చేనేతకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. అగ్గిపెట్టెలో చీర నేసిన ఘనత మన చేనేత కళాకారులదని… అలాంటి వృత్తిని బతికించేందుకు జీఎస్టీ రద్దు చేయాలని కేంద్రాన్ని కొరతామన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు ఇకపై ప్రతి ఒక్కరూ వారానికి ఒక సారైనా చేనేత దుస్తులు ధరించాలని కోరారు. నిత్యం చేనేత దుస్తులు ధరించే ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావును మంత్రి ఆదేశించారు. గద్వాల, నారాయణపేట, కొత్తకోట, కోటకొండ చేనేత చీరలు, గొంగళ్లు, ఇతర చేనేత ఉత్పత్తులు అన్నీ ఒకేచోట లభించేలా జిల్లా కేంద్రంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నారాయణపేటలో చేనేతకు ప్రత్యేకంగా స్థలం కేటాయించినట్లు గుర్తు చేశారు. అనంతరం చేనేత ప్రతిజ్ఞ చేయించారు.
ఇదే కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర చేనేత సహకార జాతీయ సంఘానికి రూ. 12,38,960 విలువైన పావలా వడ్డీ చెక్కును మంత్రి అందించారు. చేనేత కార్మికులను సన్మానించారు. చేనేత దుస్తులతో దేశ నాయకుల వేషధారణలో ఉన్న విద్యార్థులతో మంత్రి ఫొటోలు దిగడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, డీఎస్పీ మహేష్, చేనేత, జౌళి శాఖ ఏడీ బాబు, డీఈఓ రవీందర్, ఆర్డీఓ అనిల్ కుమార్, వెటర్నరీ జేడీ మధుసూదన్ గౌడ్, ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.