పాలమూరు, నవంబర్ 13 : వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అందుకే అత్యధిక పంటలు పండించి దేశానికే అన్నంపెట్టే దిశగా తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు. ఆదివాం మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామ సమీపంలోని రైతు వేదిక ప్రాంగణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. గత ప్రభుత్వాలు కర్షకులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, నాడు కరెంట్ కోసం ధర్నా చేస్తే కాల్చి చంపిన ఘటనలను గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు.
నేడు వ్యవసాయ రంగం ఎంతో బలోపేతమైందన్నారు. ఫలితంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రంగా నిలిచిందన్నారు. గతంలో పంజాబ్, హర్యాన ఎక్కువగా పంటలు పండించే రాష్ర్టాలుగా ఉండేవని.. నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. దేశానికి కరువొచ్చినా మన రాష్ట్రం ఆదుకునే స్థితిలో ఉన్నదన్నారు. మనిషికి కావాల్సింది వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయమన్నారు. రైతన్నకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రైతు నిజాయితీ పరుడని, రైతులు సమృద్ధిగా పంటలు పండిస్తేనే మనకు ఆహారం లభిస్తుందని చెప్పారు. కొందరు వ్యక్తులు ఓర్వలేక కోర్టుల్లో వేసిన కేసులతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యం జరిగిందన్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలంగా మారుస్తామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దవాఖానలు, ఐటీ పార్కు వంటి సౌకర్యాలను కల్పించామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ ఎంపీపీ అనిత, సర్పంచ్ జరీనాబేగం పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
మహబూబ్నగర్ పట్టణంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు పాలమూరులో సరైన మౌళిక వసతులు ఉండేవి కావని, నేడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. మహబూబ్నగర్ అభివృద్ధితో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాల, దేశంలోనే పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సరస్వతీ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మాన్, వైస్ చైర్మన్ గణేశ్, వేదిక ప్రతినిధులు బాలుయాదవ్, నరేందర్, సత్యనారాయణ, శివకుమార్, హేమచంద్రుడు పాల్గొన్నారు.
దినదినాభివృద్ధి చెందుతున్న పాలమూరు
మహబూబ్నగర్ అర్బన్, నవంబర్ 13 : నాడు కనీస మౌలిక వసతులు లేని స్థితిలో ఉన్న మహబూబ్నగర్ నేడు అభివృద్ధిలో అత్యుత్తమ స్థాయికి చేరిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట సమీపంలో జాండ్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కులవృత్తుల మాదిరిగానే జాండ్ర కులాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. జాండ్ర కుల సంఘానికి రెండు ఎకరాల స్థలంలో కేటయించిన హాస్టల్, వృద్ధాశ్రమ పనులను త్వరలో పూర్తి చేయాలన్నారు. మిగిలిన పనులకు రూ.10 లక్షలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ రోజా వెంకటేశ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రామలింగం, జాండ్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనూప్, పట్టణ అధ్యక్షుడు మహేందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి బందిగె గోపి, యువజన సంఘం అధ్యక్షుడు పవన్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేశ్, కౌన్సిలర్లు అంజయ్య, వేదవ్రత్, లింగమయ్య, మృత్యుంజయ, చంద్రయ్య, శశికాంత్, సదాశివుడు, శివకుమార్, రాంచందర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.