పథకం యూనిట్లను దళితులు సద్వినియోగం చేసుకోవాలి
‘మన ఊరు-మన బడి’తో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
దళితబంధు కింద 11 మందికి ట్రాక్టర్లు
143 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
దళితబంధు దేశానికే దిక్సూచిగా నిలిచిందని, అంతటి ప్రతిష్టాత్మకమైన పథకం యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామంలో దళితబంధు నుంచి మంజూరైన నిధులతో ఏర్పాటు చేస్తున్న డెయిరీ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అలాగే హన్వాడలో 11 మందికి ట్రాక్టర్లు, 143 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారన్నారు. హన్వాడ మండలంలో 400 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హన్వాడ, మార్చి 31 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామంలో దళితబంధు నుంచి మంజూరైన నిధులతో ఏర్పాటు చేస్తున్న డెయిరీ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అలాగే హన్వాడలో 11 మందికి ట్రాక్టర్లు అందజేశారు. అనంతరం 143 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ‘మన ఊరు-మన బడి’ కింద మండలంలోని 21 పాఠశాలలు ఎంపిక కాగా హ న్వాడలో రూ.28 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాలల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దళితుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు ప్రవేశపెట్టిందన్నారు. యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
400 ఎకరాల్లో ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హన్వాడ మండలాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. మండల కేంద్రానికి రూ.3.50 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేశామని, త్వరలోనే భూమి పూజ చేస్తామని చెప్పారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. 65 ఏండ్లు పాలించిన సీమాంధ్ర పాలకులు పాలమూరు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. నేడు తెలంగాణ ఏర్పడ్డాక పాలమూరులో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. మన పథకాలు దేశంలోనే అదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా.. అందరూ కలసికట్టుగా.. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. అందుకే వ్యవసాయ రంగానికి సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. రైతుబీమా, రైతుబంధుతోపాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుటి వరకు హన్వాడ మండలంలో రూ.11.38 కోట్లు కల్యాణలక్ష్మి కింద లబ్ధిదారులకు అందించామన్నారు. ప్రతి నెలా రూ.కోటీ 20,6700 పింఛన్ డబ్బులు ఇస్తున్నామని తెలిపారు.
చేతులెత్తి మొక్కుతా.. పనులు చేయండి..
హన్వాడలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ యార్డు, మటన్ మార్కెట్ కేంద్రం, ఓపెన్ జిమ్ పనులు త్వరగా పూర్తి చేయండి.. మీకు చేతులెత్తి దండం పెడుతానని.. మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన జరుగుతున్నాయని, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరైతే పనులు చేయరో వారి పేర్లు గ్రామాల్లో బోర్డు రాసి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. అధికారులతో మండల సమాచారం పూర్తి స్థాయిలో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, డీఆర్డీవో యాదయ్య, ఆర్డీవో పద్మశ్రీ, ఎంపీపీ బాల్రాజ్, జెడ్పీటీసీ విజయ నిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచులు రేవతి, సుధ, ఎంపీటీసీలు సత్యమ్మ, కల్పన, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏపీఎం సుదర్శన్, టీఆర్ఎస్ అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, నాయకులు కొండ లక్ష్మయ్య, జంబులయ్య, బాలయ్య, బసిరెడ్డి, రామణారెడ్డి, హరిచందర్, శివకుమార్, జహంగీర్, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.