మహబూబ్నగర్, నవంబర్ 9 : మహబూబ్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి శ్రీనివాస్గౌడ్ జనసందోహం మధ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి న్యూటౌన్, మెట్టుగడ్డ, రైల్వేస్టేషన్ చౌరస్తాతోపాటు ప్రధాన రోడ్డు గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రంతో బయలు దేరారు. అర్చకుల వేదమంత్రాలతో మంత్రి సతిమణి శారద, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తల్లిదండ్రుల చిత్రపటాల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు శాంతమ్మ, నారాయణగౌడ్ సమాదుల వద్ద ఆశీర్వాదం తీసుకుకున్నారు. అనంతరం ఎంబీసీ చర్చిలో రెవరన్ వరప్రసాద్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యకర్తలతో కలిసి మంత్రి ప్రత్యేకంగా డాన్స్ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ షాషాబ్గుట్ట దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ రజాక్షాఖాద్రీని కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకొని వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీకప్ చౌరస్తా నుంచి బస్టాండ్ మీదుగా నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత సయ్యద్ ఇబ్ర హీం, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అనీల్కుమార్కు అందజేశారు.
ప్రజలకు మంచి చేయాలన్న తపన కాంగ్రెస్, బీజేపోళ్లకు లేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కులమతాలకు అతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి చేస్తున్నదన్నారు. రైతులకు మంచి చేయాలనే తపన ప్రతిక్షణం సీఎం కేసీఆర్కు ఉందని, మహబూబ్నగర్ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు దిమ్మతిరిగేలా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. పదేండ్లలో ఊహించని అభివృద్ధి చేశామన్నారు. మహబూబ్నగర్లో వెయ్యి పడకల సూపర్స్పెషాలిటీ దవాఖాన, ఐటీ పార్కు, 26 ఎకరాల్లో జంగల్ సఫారీ పార్కు, 2,087 ఎకరాల్లో కేసీఆర్ ఎకో పార్కు, బైపాస్ రోడ్డు, మినీ ట్యాంక్బండ్ ఇలా చెప్పుకుంటేపోతే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ జాబేర్ బిన్ సయ్యద్, ఎంఐఎం యువత అధ్యక్షుడు జాకీర్ అడ్వకేట్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్ తదితరులున్నారు.