వనపర్తి, జూన్ 7 : ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక.. పంటలు పండక.. కడుపుచేత పట్టుకుని వలసలు వెళ్లిన ప్రజల ఆకలిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించి కరువుకు నెలవుగా ఉన్న ఉమ్మడి పాలమూరును కృష్ణమ్మ నీళ్లతో సస్యశ్యామలం చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మావతి గార్డెన్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. స్వరాష్ట్రంలో ఒక్కో రంగంలో సాధించిన విజయాలను చూస్తుంటే ఉద్యమ కాలంలో, ఉమ్మడి పాలనలో అనుభవించి కష్టాలు, నష్టాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయన్నారు. ఉమ్మడి పాలమూరులో 35లక్షల ఎకరాల భూమి ఉండగా, ఆర్డీఎస్ ద్వారా 90వేల ఎకరాలు, జూరాల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీటిని ఇవ్వలేని స్థితిలో మనల్ని పాలించారన్నారు.
నీలం సంజీవ్ రెడ్డి అప్పర్ కృష్ణా ప్రాజెక్టుపై ఒక్కనాడు మాట్లాడిన దాఖలాలు లేవని, ఒకవేళ ప్రాజెక్టు కట్టాలన్నా కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోదని దాటవేశారన్నారు. తొలి తెలంగాణ ఉద్యమంలో అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా నామమాత్రపు హామీల్లో మిడ్మానేరు, కాకతీయ విశ్వవిద్యాలయం, జూరాల ఇచ్చారని గుర్తుచేశారు. 50టీఎంసీల నిల్వ నిర్మాణం ఉండేలా ప్రణాళికను జూరాలకు సిద్ధం చేయగా, 20 టీఎంసీలకు కుదించి కట్టేటప్పుడు 11టీఎంసీలకు తీసుకొచ్చి నిల్వ నీటిని వాడుకునేది చివరకు 6.5 టీఎంసీలకు తెచ్చిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో పాలకులకే దక్కుతుందని విమర్శించారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఉమ్మడి పాలమూరు నుంచి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లి పాలమూరుకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతల ద్వారానే సాధ్యమవుతుందని వివరించగా, అందుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని సీఎం చెప్పినా అది అక్కడితోనే ఆగిపోయిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సిద్ధేశ్వరం వద్ద కడితే తెలంగాణకు నీళ్లు వస్తాయని.. తెలంగాణకు నీళ్లురావద్దనే శ్రీశైలం వద్ద కట్టారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎంను ఒప్పించి నీళ్లు తీసుకొచ్చా..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 16 కిలోమీటర్ల వద్ద తూము ద్వారా పెద్దమందడి, 37 కిలోమీటర్ల వద్ద తూము నుంచి ఖిల్లాఘణపురానికి నీళ్లను తీసుకురావడానికి బ్రాంచ్ కెనాల్ను 11 నెలల్లో పూర్తి చేసి గణప సముద్రం నింపామని మంత్రి తెలిపారు. 25 టీఎంసీలుగా ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వనపర్తికి నీళ్లు వచ్చేలా సీఎం కేసీఆర్ను ఒప్పించి 40 టీఎంసీలకు పెంచి బ్రాంచ్ కెనాల ద్వారా నీటిని తీసుకొచ్చామన్నారు. ఓ ప్రబుద్డుడికి లైసెన్స్ ఇప్పించి పదవి ఇచ్చి పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ పని అప్పగిస్తే కాల్వ నేను తీసినా.. నీళ్లు నేనే తెచ్చినని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. అన్ని వాగుల మీద 15 చెక్డ్యాంలను నిర్మించామని, ఎండాకాలంలో సైతం నీళ్లు ఉన్నాయని.. పిల్లలు ఈతలు కొడుతున్నారని తెలిపారు. మరో రూ.30కోట్లతో చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలను పంపినట్లు మంత్రి వివరించారు. ప్రతి చెరువు, కుంటలో ప్రజలు సంబురాలు చేసి గ్రామ దేవతలకు మొక్కి అందరితో భోజనం చేసి గంగమ్మ వెంట ఉండాలని మంత్రి కోరారు.
పనులన్నీ పూర్తయ్యాయి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
జిల్లాలో సాగునీటికి సంబంధించిన అన్ని పనులు దాదాపుగా పూర్తయ్యాయని, కేవలం ప్రారంభోత్సవాలు మాత్రమే ఉన్నాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి సాగునీటి కోసం అహర్నిషలు కృషి చేసి వాగులు, వంకలు, కాల్వల ద్వారా నీటిని తీసుకొచ్చారని తెలిపారు.
ప్రతి గ్రామానికి సాగునీరు..
వనపర్తి రూరల్, జూన్ 7 : నియోజకవర్గంలోని ఒక కాశీంనగర్ గ్రామం తప్పా అన్ని గ్రామాలకు సాగునీరు వచ్చినట్లేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని దత్తాయిపల్లి పెద్దతండా శివారు లో రూ.18.66కోట్లతో ఎంజీకేఎల్ డీ-8, ఎంజే-4 బ్రాంచ్ కెనల్ ద్వారా చేపట్టే పనులకు కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశా రు. కాల్వ ఏర్పాటుతో చందాపూర్, ద త్తాయిపల్లి, పెద్దతండా, సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం గ్రామాలకు సాగునీరు అందనున్నదన్నారు.