Palamuru Rangareddy | నాగర్కర్నూల్(నమస్తే తెలంగాణ)/కొల్లాపూర్/కోడేరు/వనపర్తి, మే 6 : కోర్టు కేసులతో ఇంటి దొంగలు అడ్డుకోవడంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా శరవేగంగా పనులు పూర్తి చేసి రెండున్నర నెలల్లో సాగునీరు పారిస్తామని స్పష్టం చేశారు. శనివారం నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను సీఎంవో కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్రావు బృందం పరిశీలించింది. ముందుగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల వద్ద పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు పర్యవేక్షణతో పనులను వేగిరం చేయాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చడంలో కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తారు. స్మితాసబర్వాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మోటర్లు రన్ అయ్యే వరకు ఎంజీకేఎల్ఐ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లో 3 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూడాలని ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. కొల్లాపూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనుల ప్రగతిని మంత్రి, సీఎంవో ఓఎస్డీ స్మితా సబర్వాల్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, తెలంగాణ ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్రావుతో కూడిన ప్రతినిధి బృందం శనివారం పరిశీలించారు. వేపలచెరువు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అప్రోచ్ చానల్, దానిపై నిర్మించిన హెడ్ రెగ్యులెటర్ను పరిశీలించారు. అనంతరం ప్యాకేజీ-1లో కిలోమీటరు పొడవునా తవ్విన టన్నెల్లోకి వెళ్లి పంప్హౌస్ పనుల ప్రగతిని పరిశీలించి కంట్రోల్రూం, ప్యానెల్ బోర్డుకు చేరుకున్నారు.
ఎల్లూరు నుంచి నీటిని నార్లాపూర్ రిజర్వాయర్కు విడుదల చేసే స్లూయిస్ పనులను పరిశీలించారు. ఎల్లూరు రిజర్వాయర్ బండ్కు ముప్పు తలెత్తకుండా ఎఫ్ఆర్ఎల్ను మెయింటనెన్స్ చేస్తూ నార్లాపూర్ రిజర్వాయర్లో 3 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా చూడాలని ఈఎన్సీ మురళీధర్రావును మంత్రి ఆదేశించారు. అంతవరకు షీల్ట్ తొలగింపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులో మొదటి ప్యాకే జీ పనులను పూర్తి చేసి (జూలై నాటికి) వానకాలానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సున్నపుతండా సమీపంలో ఓపెన్ కెనాల్పై నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ను, కెనాల్ను పరిశీలించారు. ఓపెన్ కెనాల్లో మట్టిని పూర్తిగా తొలగించకపోవడంతో కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. జాగ్రత్తలు తీసుకుంటూ పనిని పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు స్మితా సబర్వాల్ సూచించారు.
పనుల్లో వేగం పెంచాలి ;సమీక్షలో స్మితా సబర్వాల్
పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లను స్మితాసబర్వాల్ ఆదేశించారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ సమావేశమై మాట్లాడారు. ప్రణాళికలు రూపొందించుకొని షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతాయన్నారు. పనులను ఉన్నతాధికారులు, కలెక్టర్లు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సమావేశంలో వనపర్తి, కందనూలు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, ఉదయ్కుమార్, నాగర్కర్నూల్ ఇరిగేషన్ సీఈ హమీద్ ఖాన్, మేఘా కంపెనీ ప్రతినిధి ఉమామహేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు, బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, గోపాల్పేట, రేవల్లి మండలాల ఎంపీపీలు సంధ్య, సేనాపతి, జెడ్పీటీసీలు భార్గవి, భీమయ్య, నాయకులు తిరుపతయ్య, కోటేశ్వర్రెడ్డి, రఘుయాదవ్, సర్పంచులు సునీల్కుమార్, లక్ష్మి, జ్యోతి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.