‘గతంలో హైదరాబాద్ సభ సాక్షిగా సుష్మా స్వరాజ్ ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలి.. కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చాలి’.. అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.82 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్పర్సన్లతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పట్టణంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతి సభలో కేటీఆర్ మాట్లాడారు. పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కండ్లు ఎర్రబడుతున్నాయని.. చెరువులు నిండుతుంటే గుండెలు మండుతున్నాయని అన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా పాదయాత్రలు చేస్తూ పచ్చి అబద్ధాలు కూస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు కేటాయించామని, కేంద్రం నయా పైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు. రైల్వే ప్రాజెక్టుల్లోనూ అన్యాయం జరిగిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతకు ఎడ్లు, వడ్లు తెలియవని.. పబ్బులు మాత్రమే తెలుసని రాహుల్ను ఉద్దేశించి మాట్లాడారు.
మహబూబ్నగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్, బీజేపీ నాయకత్వంపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణపై ప్రేమ ఉంటే కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం వెనుకబడిన ఈ ప్రాం తానికి పూర్తి అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోయినా సిగ్గులేకుండా బీజేపీ నేతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రం లో పలు అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతి సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కృష్ణా జ లాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని కొందరు పనికిమాలిన మాటలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. అధికారికంగా లెక్కల ప్రకారం కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీ కేటాయింపులు ఉండేవన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా నీటి వాటాలు కేటాయించడం లేదన్నారు. పాలమూరు, నల్లగొండ జిల్లాలకు 575 టీఎంసీలు ఇ వ్వాలని ఎనిమిదేండ్లుగా కోరుతూనే ఉన్నామన్నారు. స్వయంగా మోదీని సీఎం కేసీఆర్ అడిగారని గుర్తు చేశారు. అయినా కేంద్రంలో ఉలుకుపలుకు లేదన్నారు. సెక్షన్ 3 కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని అడిగినా లాభం లేదన్నారు. దున్నపోతు మీద వానపడ్డట్టు కేంద్రం ఉలుకు ప లుకు లేకుండా ప్రవర్తిస్తున్నదని ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే కొందరి కండ్లు ఎర్రబడుతున్నాయని.. చెరువులు నిండుతుంటే గుండెలు మండుతున్నాయని ఘాటుగా విమర్శించారు.
చేనేతపై పన్ను వేసిన మొదటి ప్రధాని..
అజ్ఞానులు.. సిగ్గులేని బీజేపీ నాయకులు నేత కార్మికుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చేనేత మీద జీఎస్టీ పన్ను విధించిన ఏకైక ప్రధాని మోదీనే అని అన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా చేనేత సమూహాలు మంజూరు చేయగా, నారాయణపేట, కొత్తకోట, గద్వాలకు ఒక్క టి కూడా కేటాయించలేదన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, నరేందర్ రెడ్డి, డా.సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, సురభి వాణీదేవి, కార్పొరేషన్ చైర్మన్లు వాల్యానాయక్, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, సాయిచంద్, ఇంతియాజ్ ఇసాక్, జెడ్పీ చైర్పర్సన్లు వనజ, స్వర్ణసుధాకర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, కలెక్టర్ దాసరి హరిచందన, నేతలు దేవరి మల్లప్ప, చిట్టెం సుచరితరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎడ్లు, వడ్లు తెలియవు.. పబ్బులు మాత్రం తెలుసు..
ఓ జాతీయ పార్టీ నేతకు ఎడ్లు, వడ్లు తెలియవు.. డబ్బులు మాత్రం తెలుసని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబం ధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ లేనేలేవన్నా రు. 50 ఏండ్లు దేశాన్ని చేతిలో పెడితే సర్వనాశనం చేశారని విమర్శించారు. ‘నోట్ల రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తానని బయలుదేరాడట’ అని రాహుల్ గాంధీని విమర్శించారు. సొంత నియోజకవర్గం అమేథీలో గెలవలేక తెలంగాణలో వచ్చి గెలుస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. కాంగ్రెస్ వాళ్లు చెప్పిన మాటలు నమ్మడానికి ఇది 10 జనపథ్ కాదని.. పాలమూరు పౌరుషాన్ని రుచులు చూపించే జనపదమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నీతిలేని పార్టీలని, నాడు పాలమూరును ఎడారి చేస్తే.. నేడు పచ్చగా చేస్తుంటే కండ్లుమండుతున్నాయని విమర్శించారు. తెలంగాణ బిడ్డగా సీఎం కేసీఆర్కు ఉండే ఆర్తి, ప్రేమ జాతీయ పార్టీ నేతలకు ఉండబోదన్నారు. పెద్దలు చెప్పినట్లు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ గుండె చ ప్పుడు కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
పాదయాత్ర పేరిట అబద్ధాలు..
పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేకపోగా పాదయాత్రలు చేస్తూ ప చ్చి కారుకూతలు, అబద్ధాలతో బీజేపీ నేతలు పాలమూరు రైతులను మోసం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేని మాట లు మాట్లాడుతున్నారని.. 299 టీఎంసీలకు సీఎం కేసీఆర్ ఒప్పుకొన్న ట్లు అబద్ధాలు చెబుతున్నారన్నారు. దమ్ముంటే, పలుకుబడి ఉంటే, తె లంగాణపై ప్రేమ ఉంటే.. సుష్మా స్వరాజ్ హైదరాబాద్లో ప్రకటించిన ట్లు మోదీకి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘తుంగభద్ర నదిపై ఉన్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇస్తరు.. కానీ మేం అడిగితే వినబడనట్టు ముం దుకు పోతరని అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమిత్ షాకు నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు కేటాయించి, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలన్నారు. ఈనెల 14న తెలంగాణకు వస్తున్న కేంద్ర హోంమంత్రిని జాతీ య హోదాపై సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు.
కేంద్ర విద్యా సంస్థలెక్కడ..?
కొత్త జిల్లాలు ఏర్పాటైతే నవోదయ పాఠశాల పెట్టాలని రాజ్యాంగంలో ఉందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక 84 నవోదయాలు, దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఏఎంలు మంజూరు చేస్తే మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. కులం, మత పేరు మీద రాజకీయాలు చేయడం మాత్రం వచ్చని మండిపడ్డారు.
ఫ్రీ కరెంట్ ఇవ్వొద్దంటున్నడు..
రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉచితంగా ఇవ్వడం కేంద్రానికి నచ్చడం లేదని.. రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వొద్దని మోదీ ఆదేశిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. పొలాల వద్ద మీటర్ పెట్టాలని విద్యుత్ చట్టం తీసుకొచ్చిండన్నారు. మీటర్లు పెట్టకపోతే అప్పులు ఇవ్వమని బెదిరిస్తున్నారని వెల్లడించారు. రానున్న ఐదేండ్లలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన రూ.25 వేల కోట్లలో పైసా ఇవ్వనంటున్నాడన్నారు. ‘నేను బతికున్నంత కాలం రైతుల మోటార్ వద్ద మీటర్ పెట్టే ప్రసక్తే లేదని’ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. కేంద్రం డబ్బులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తామని సీఎం తేల్చిచెప్పారన్నారు.
28 పైసలు కూడా ఇవ్వలే..
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.28 వేల కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు చెరువులను నింపేందుకు రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి 8 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు అందించామన్నారు. కేంద్రం కనీసం 28 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. సిగ్గులేకుండా పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ నుంచి నారాయణపేట మీదుగా కృష్ణాకు, గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వేలైన్ అడుగుతున్నా స్పందించలేదన్నారు.
ఏ శిక్షకైనా సిద్ధం..
రాష్ట్రంలో ఖర్చు చేస్తున్న నిధుల్లో నా పైసలు అంటూ బడాయికిపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం డబ్బులున్నాయని ఒకాయన పాదయాత్ర చేస్తూ అడ్డంపొడవు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చెట్లు, నల్లా కనెక్షన్లు, ఆసరా పింఛన్లు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఇలా.. పథకాలన్నింటిలో మా పైసలు ఉన్నాయని అంటున్నాడని, మరి కేంద్రం పైసలే మన పథకాల్లో ఉంటే.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలు కావడం లేదంటూ ప్రశ్నించారు. కర్ణాటకలోని రాయిచూర్కు పోదాం.. మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే.. మా పథకాలన్నీ అక్కడ చూపిస్తావా? ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు. ఉత్తమ గ్రామపంచాయతీలుగా టాప్ టెన్లో అన్నీ మన రాష్ర్టానివే ఉన్నాయన్నారు. మరి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉత్తమ గ్రామాలు ఎందుకు ఎంపిక కావడం లేదన్నారు. తాను చెప్పేదాంట్లో ఒక్క అక్షరం తప్పు ఉన్నా ఏ శిక్షకైనా సిద్ధం అని తేల్చిచెప్పారు. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం 28 రాష్ర్టాల్లో భౌగోళికంగా 11వ స్థానంలో.. జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ ఆర్థిక శక్తిగా మాత్రం నాలుగో స్థానంలో ఉందని వెల్లడించారు. గత ఏడు నెలల్లో పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూ.3,65,795 కోట్లు చెల్లిస్తే.. కేంద్రం మాత్రం కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చిందన్నారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి కడితే వాళ్లు తిరిగి ఇచ్చింది 45 పైసలు మాత్రమేనని వెల్లడించారు. వెనుకబడిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో తెలంగాణ పైసలతో ప్రాజెక్టులు కడుతున్నారన్నారు.
రాజేందర్రెడ్డి.. గొప్ప నాయకుడు..
నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై మం త్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. గొప్ప ఎమ్మెల్యే అని, సమర్థత, దక్షత ఉన్న నాయకుడని కొనియాడారు. ఆయన ఎమ్మెల్యే కావడం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. అతి త్వరలోనే ప్రతి ఇంటికీ నిత్యం తాగునీరు అందుతుందన్నారు. గోల్డ్సోక్ను దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. రూ.6.65 కోట్లతో మినీ స్టేడియానికి శంకుస్థాపనన చేశామని, మరో రూ.4 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్కు అనుమతులు ఇస్తున్నామన్నారు. మినీ ట్యాంక్బండ్ను వచ్చే వినాయకచవితి నాటికి పూర్తి చేస్తామన్నారు. రూ. 87.45లక్షలతో చైల్డ్ హోంను ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఉర్దూలో పరీక్ష రాస్తే తప్పేంటి..?
గ్రూప్ -1 పరీక్షలు ఉర్దూలో నిర్వహించొద్దని కొంత మంది నాయకులు వాగ్వాదం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఉర్దూను అధికారిక భాషగా గుర్తించలేదా..? యూపీఎస్సీతోపాటు కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఉర్దూ భాష లేదా? మరి అక్కడున్నప్పుడు లేని బాధ ఇక్కడెందుకు వస్తుందని ప్రశ్నించారు. ఉర్దూను ఒక ముస్లిం భాష, మతం భాషగా చూడడమేనా? ఇదేనా నీతి. పిల్లల మనసుల్లో విషం నింపడమేనా? ఉర్దూలో రాస్తే తప్పేంటి? ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉర్దూ భాషలో పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ఇక్కడ కొంతమంది నాయకులు దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి అని సవాల్ విసిరారు.
కులం, మతం పేరిట రాజకీయాలు..
బీజేపీ నాయకులు కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టం వచ్చినట్లు అమ్మేస్తున్నా.. మతాల పేరిట చిచ్చుపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కనీసం 50 మంది వెంట లేకున్నా పాదయాత్రలో గొంతు చించుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారు. బంగారు వ్యాపారులు, కార్మికులకు కనీస వసతులు కల్పించాలని ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదు. గోల్డ్ మార్కెట్తో పేట బంగారానికి మరింత ఖ్యాతి వస్తుంది. చేనేత కార్మికుల కోసం పేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
కేంద్రం నుంచి స్పందన నిల్..
సైనిక్ స్కూల్ ఇచ్చినా పట్టించుకోలేదని.. బీజేపీకి చెందిన ఓ మాజీ ఎంపీ విమర్శలు చేస్తున్నారు. కానీ, సైనిక్ స్కూల్ కోసం 50 ఎకరాలు సిద్ధం చేసినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నది గమనించి మాట్లాడాలి. సైనిక్ స్కూల్ కోసం భూమి ఇవ్వలేదని సిగ్గులేకుండా పేర్కొనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. నవోదయ విద్యాలయాలు మన హక్కు. కేంద్రం భిక్షం కాదు. స్థానిక చేనేత సొసైటీ ఆస్తిని బీజేపీ నాయకులు కొనుగోలు చేసి చేనేత కార్మికులను బజారునపడేశారు.తమ వద్ద పథకాలు బాగోలేవని.. తమను తెలంగాణలో కలపాలని కోరిన రాయిచూరు ఎమ్మెల్యే.. నారాయణపేట సమావేశంలో తన మాటలను వక్రీకరించారనడం సిగ్గుచేటు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా నా ఓటమి చూడలేరు. కేటీఆర్ గ్రీన్సిగ్నల్ ఇస్తే రాయిచూర్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్కు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తా. తెలంగాణ ధాన్యం రాయిచూరు వస్తుందంటున్నాడు.. కానీ, ఇటీవల దొంగచాటుగా పేటకు కర్ణాటక ధాన్యాన్ని తరలిస్తుంటే పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తుంచుకో.. దుబాయ్ స్థాయిలో నారాయణపేటలో నాలుగెకరాల్లో రూ.20 కోట్లతో గోల్డ్ సోక్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న గోల్డ్ సోక్ ఇదే. ‘దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో 156 కుటుంబాలు వందేండ్లుగా రెండు వందల ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. వారికి పాస్బుక్కులు లేక రైతుబంధు, రైతు బీమాతోపాటు బ్యాంకుల్లో లోన్లు కూడా లభించడం లేదు’ అని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లా. ఎవరెవరు భూములు దున్నుకుంటున్నారో.. వారందరికీ భూమిపై హక్కులు ఇవ్వాలని కోరా. ఈ భూమి పక్కనే వృథాగా ఉన్న 800 ఎకరాలను ఫుడ్పార్క్ కోసం కేటాయించాలి.
– ఎస్.రాజేందర్రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే
రూ.82.44 కోట్లతో అభివృద్ధి పనులు
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్
నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.82.44 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మంత్రి కేటీఆర్ నారాయణపేటకు వచ్చారు. రూ.29.59 కోట్ల తో సింగారం చౌరస్తా సమీపంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం పక్కన ఉన్న సంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన ట్యాంకులు, పైప్లైన్లకు సంబంధించిన పైప్లైన్, రూ.కోటితో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఆరో వార్డు బీసీ కాలనీ సమీపంలో రూ. 1.20 కోట్లతో నిర్మించనున్న పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడే 13 ఎకరాల్లో రూ.6.65 కోట్లతో చేపట్టనున్న స్టేడియం నిర్మాణ పనులకు శం కుస్థాపన చేశారు. రూ.20 కోట్లతో నిర్మించనున్న గో ల్డ్ సోక్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు. గోల్డ్ సోక్ మార్కెట్ డెమోను నిర్వాహకులు పవర్ ప్రెజెంటేష న్ ద్వారా వివరించారు. ఎర్రగుట్ట వద్ద రూ.2 కోట్ల తో నిర్మించనున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి, రూ.కోటితో చేపట్టనున్న మోడరైజేషన్ ఆఫ్ ల్యాండ్రికి శంకుస్థాపన చేశారు. చిల్డ్రన్ దవాఖాన సమీపంలో రూ.1.35 కోట్లతో నిర్మించనున్న చికెన్, చేపల మార్కెట్ను ప్రారంభించారు.
ఈ సందర్భం గా చికెన్, చేపల విక్రయదారులతో మాట్లాడారు. ‘ఇది వరకు తాము రోడ్లపైనే విక్రయించేవారమని, మార్కెట్తో ఎంతో మేలు కలిగిందని, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందనకు కృతజ్ఞతలు’ అని వారు మంత్రికి తెలిపారు. అనంతరం సర్వే నెంబర్ 108, 109, 110లోని ఖాళీ స్థలంలో రూ.కోటితో నిర్మించనున్న మున్సిపల్ షా పింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో రూ.12కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి 15 వ వార్డులో ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని ప్రారంభించారు. దామరగిద్ద మార్గంలోని కొండారెడ్డిపల్లి చెరువు వద్ద రూ.4కోట్లతో చేపట్టనున్న మినీ ట్యాంక్బండ్ పనులకు శంకుస్థాపన చేశారు. పేరపళ్ల మా ర్గంలోని శివాలయం సమీపంలో రూ.1.10 కోట్లతో నిర్మించిన వృద్ధాశ్రామన్ని ప్రారంభించారు. రూ.87.45 లక్షలతో చేపట్టనున్న చిల్డ్రన్ పార్క్కు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, సా ట్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, జెడ్పీ చైర్పర్సన్లు వనజ, స్వర్ణసుధాకర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరిత, కలెక్టర్ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.