రేవంత్రెడ్డి.. లీడర్లను కొనవచ్చేమో గానీ తెలంగాణ బిడ్డలను కొనే దమ్ము నీకు లేదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా గురువారం నియోజకవర్గ కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఓటుకు నోటుతో అడ్డంగా దొరికిపోయి కొడంగల్ పరువు తీశాడని రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. 20 ఏండ్ల కిందట సున్నాలు వేసి బతికే వ్యక్తి.. బ్లాక్మెయిల్, బ్రోకర్, సెటిల్మెంట్ దందాలతో కోట్లు సంపాదించి టీపీసీసీ పదవిని కొనుక్కొని, నేడు కాంగ్రెస్ టికెట్లను అమ్ముకుంటున్నాడన్నారు. గిరిజనులు, ప్రజలు అమ్ముడుపోయే వారు కారని బొంరాస్పేట్ సర్పంచ్ నర్సింగ్నాయక్ నిరూపించినట్లు తెలిపారు. రెండేండ్లలోనే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్కు సాగునీరందిస్తామ న్నారు. తాము ఏనాడూ కులం, మతం పేరిట పంచాయితీలు చేపట్టలేదని, అన్ని వర్గాల వారికి సమన్యాయాన్ని అందిస్తున్నామన్నారు. కారు గుర్తుకు ఓటేసి నరేందర్రెడ్డిని గెలిపిస్తే తప్పనిసరిగా ప్రమోషన్ ఇస్తామని స్పష్టం చేశారు. మద్దూరును మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి, నియోజకవర్గంలో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు.
కొడంగల్, నవంబరు 9 : ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని రెండోసారి గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు మొక్కైనా సరే ప్రమోషన్ ఇప్పించే బాధ్యత తీసుకొంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా కొడంగల్ పట్టణంలో రోడ్ షో, పబ్లిక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్నింటా అభివృద్ధితో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదలను కడుపులో పెట్టుకొని సీఎం కేసీఆర్ కాపాడుతున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించుకున్నందుకు కన్నడ ప్రజలు నేడు చెంపలేసుకొంటున్నారని, తెలంగాణ బిడ్డలు ఆ తప్పు చేయొద్దని కోరారు. ఓటుకు నోటుతో అడ్డంగా దొరికిపోయి కొడంగల్ పరువును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ తీశాడన్నారు. 20 ఏండ్ల కిందట రేవంత్రెడ్డి సున్నాలు వేసుకొని బతికేవాడని, బ్లాక్మెయిల్, బ్రోకర్, సెటిల్మెంట్ దందాలతో కోట్లు సంపాదించినట్లు ఆరోపించారు. పీసీసీ పదవిని కొనుక్కొని, కాంగ్రెస్ టికెట్లను అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నాడని మండిపడ్డారు. అవే డబ్బులను నేడు కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలను కొంటున్నట్లు తెలిపారు. సర్పంచులను కొనుగోలు చేసే రేవంత్ ప్రయత్నాన్ని గిరిజన సర్పంచ్ తిప్పికొట్టారని, గిరిజనులు అమ్ముడుపోయే వారు కారని బొంరాస్పట్ సర్పంచ్ నర్సింగ్నాయక్ నిరూపించినట్లు చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కొడంగల్లో లక్షా 25వేల ఎకరాల సాగునీరందనున్నట్లు తెలిపారు. త్వరలోనే కొడంగల్కు పాలమూరు-రంగారెడ్డి నీళ్లు వస్తాయన్నారు. కొడంగల్లో బీటీ రోడ్లు, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, 50, 30 పడకల దవాఖానలు, రెండు మున్సిపాలిటీలు, మూడు కొత్త మండలాలు వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. కొడంగల్లో అభివృద్ధి చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రజలు ఎక్కడ నిలదీస్తారనే భయంతో రాత్రుల్లో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. రేవంత్రెడ్డి పాపపు సంపాదన ఎంత ఇస్తే అంత తీసుకొని కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ కులం, మతం పేరుతో పంచాయతీలు చేపట్టలేదని, అన్నివర్గాల వారికి సమన్యాయాన్ని అందిస్తూ ప్రతివర్గం అభ్యున్నతికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అందించి ఆదరిస్తున్నట్లు తెలిపారు. నరేందర్రెడ్డిని గెలిపిస్తే.. కొడంగల్ నియోజవర్గంలో మద్దూర్ మండలాన్ని మున్సిపాలిటీ గా, నియోకవర్గంలో ఒక రెవెన్యూ డివిజన్, ప్ర భుత్వ ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, 100 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటునకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. రైతుబం ధు కావాలా.. రాబంధులు కావాలా..? ప్ర జల మధ్యన ఉండే నాయకుడు కావా లా..? చేతులూపే నాయకుడు కావాలో ప్రజలు తే ల్చుకోవాలన్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో ప్రభంజనాన్ని సృష్టించనున్నదని, ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ విజయం సాధించడం ఖాయమని మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకున్న తర్వాత కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి సాధ్యపడిందన్నారు. గతంలో రేవంత్రెడ్డిని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నప్పటికీ కొడంగల్ ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించిందని, నేడు దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో మూడో సారి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానున్నదని, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.
2018కి ముందుకు కొడంగల్ ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేదని, సీఎం కేసీఆర్ హయాంలోనే కొడంగల్ అభివృద్ధికి రూ.960కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో కొత్తగా 47తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయన్నారు. ప్రతి తండాలో బీటీ రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు ఏర్పడటంతో కేసీఆర్ను దేవుడిలా కొలుస్తున్నట్లు తెలిపారు. గతంలో రేవంత్రెడ్డి ఎటువంటి అభివృద్ధిని చేపట్టకపోగా, నేటి అభివృద్ధి ఆయన కండ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కొడంగల్లో తిరిగితే మేం చేసిన అభివృద్ధి తెలిసేదన్నారు. సంవత్సరానికి రెండుసార్లు వచ్చేవారికి ప్రజల గురించి ఏం తెలుస్తుందన్నారు. ఓటమి భయంతో గుర్నాథ్రెడ్డిని ఆశ్రయించాడని, గతంలో గుర్నాథ్రెడ్డిని బొందపెడతా, కోట గోడలను కూలుసాన్తని చెప్పడం జరిగిందన్నారు. మరో మారు ఆశీర్వదిస్తే కొడంగల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇండస్ట్రీ ఏర్పాటు చేసేందుకు గాను ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ రోడ్ షో కార్యక్రమం భారీ జన సందోహం మధ్య కొనసాగింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో కొడంగల్ నియోజకవర్గంలో అంబేద్కర్ కూడలి కిక్కిరిసిపోయింది. పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకున్న మంత్రికి అక్కడి నుంచి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీతో చేరుకున్నారు. గ్రామల నుంచి జనాలు ప్రత్యేక వాహనాల్లో, బైక్లపై రోడ్ షోకు చేరున్నారు. మంత్రి రోడ్ షోతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.