అమ్రాబాద్, ఆగస్టు 26 : తొమ్మిదేండ్లలో దేశం గర్వించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు, తెలంగాణ ప్రజల పాలిట అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. శనివారం ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.2కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మండలంలోని మన్ననూర్ విడిది భవనం వద్ద మంత్రికి పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అటవీశాఖ తరఫున మంత్రికి ఎమ్మెల్యే ఏటీఆర్ జ్ఞాపికను అందజేశారు.
కోటి వృక్షార్చనలో కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి మనన్నూర్, అమ్రాబాద్లో రోడ్లకిరువైపులా మొక్కలు నాటారు. అనంతరం అమ్రాబాద్లో రూ.62లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను ప్రారంభించారు. మైనార్టీ నూర్బాషా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఖబరస్థాన్ ప్రహరీ, మసీదు మరమ్మత్తులకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. అమ్రాబాద్లో బీఆర్ఎస్ నాయకులు మంత్రిని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి కోలాటంతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ అట్టడుగునున్న వారిని ఆర్థికాభివృద్ధి వైపు మళ్లించారని, అందుకు దళితబంధు నిదర్శనమన్నారు.
దేశంలో దళితబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అచ్చంపేటలో గువ్వలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గువ్వల ఉమామహేశ్వర ప్రాజెక్టుతో అప్పర్ప్లాటును సస్యశ్యామలం చేస్తారని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు నియోజకవర్గంలోని అమ్రాబాద్ లేదా మరో మండలం మొత్తానికి దళితబంధు మంజూరు చేసేలా సీఎంకు తన తరఫున సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుమ్మరోనిపల్లిలో మైనార్టీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, పదర మండలం రాయలగండిలో చెన్నకేశవస్వామి ఆలయ కల్యాణ మండప పనులకు శంకుస్థాపన చేశారు. విప్ గువ్వల మాట్లాడుతూ అమ్రాబాద్ మండలానికి ఇప్పటికే రూ.2.5కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. త్వరలో మరో రూ.6 నుంచి రూ.7 కోట్ల నిధులు విడుదల చేయిస్తానన్నారు. యురేనియం తవ్వకాల కోసం ఈ ప్రాంతంలో గునపం దించాల్సి వస్తే ముందుగా తన గుండెల్లోనే దిగాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్వో రోహిత్, ఆర్డీవో గోపీరాం, అదనపు కలెక్టర్ దీపక్, డీఆర్డీవో నర్సింగరావు, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రామ్లాల్, మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, అమ్రాబాద సర్పంచ్ శారద, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.