మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి), జూన్ 7 : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్, జడ్చర్లలో మూడు చోట్ల కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్తోపాటు మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి పర్యటనలో పాల్గొననున్నారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.