పాలమూరు మిల్లెట్స్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. తరగని పోషకాల గనులుగా కొర్రలు, సామలు, అరికెలు,ఊదలు, అండు కొర్రలు, రాగులు, జొన్నలు, దేశీయ వరి బియ్యం నిలిచాయి. జీవన విధానం మారుతున్న క్రమంలో వీటి వినియోగం మళ్లీ పెరిగింది. ఆహారపు అలవాట్లను మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో మళ్లీ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో పండిన చిరుధాన్యాల్లో మంచి రుచితోపాటు పోషక విలువలు, పీచు పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీనికి తోడు ఎరువులు,క్రిమిసంహారక మందులు వినియోగించకుండా పంట పండిస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి సింగపూర్కు ప్రతినెలా రూ.30 లక్షలకుపైగా విలువైన చిరుధాన్యాలు ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో హన్వాడలో మిల్లెట్స్ తయారు చేసి హైదరాబాద్లోని కొన్ని మాల్స్తో పాటు దేశవిదేశాలకు కార్గో విమానాలు, షిప్పుల్లో చేర వేస్తున్నారు. ఏజెన్సీలు బల్క్గా కొనుగోలు చేసి చిన్న వ్యాపారులతో పాటు మార్కెటింగ్ చేసే వారికి విక్రయిస్తున్నారు.
– మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బహిరంగ మార్కెట్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కల్తీ వస్తువులను విక్రయిస్తున్నారు. పప్పు, ఉప్పు, పాలు, పెరుగు.. ఇలా దేన్నైనా కల్తీ చేస్తున్నారు. ఈ దందా పచ్చని పల్లెలకు కూడా పాకింది. చిన్న చిన్న దుకాణాల్లో కూడా విరివిగా విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న ది. చాలామంది తక్కువ వయస్సుకే అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్ర మంలో ప్రజలు సేంద్రియంగా పండిస్తున్న పంటలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
చిరుధాన్యాలు ఎంతో బలవర్ధక ఆహారంగా ఉంటుంది. విటమిన్లు పుష్కలంగా ఉం టాయి. ఫలితంగా మన దేశం, రాష్ట్రంలో తిండి గింజలకు మంచి డిమాండ్ ఉన్నది. పాలమూరు జిల్లా నుంచి సింగపూర్కు మిల్లెట్స్ను ఎగుమతి చేస్తున్నారు. మన రాష్ట్రంలో పం డించిన చిరుధాన్యాలను కార్గో విమానాలు, షిప్పుల ద్వారా సింగపూర్ తరలిస్తున్నారు. దుబాయ్తోపాటు ఇతర దేశాల్లో కూడా మన చిరుధాన్యాలకు మంచి మార్కెట్ ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు.
చిరుధాన్యాల వైపు.. రైతుల చూపు..
ఆర్గానిక్ ఫుడ్పై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లు, బియ్యం, చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. మాములు వాటికన్నా ధర ఎక్కువైనా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అయితే, చిరుధాన్యాల్లో విటమిన్లు, ప్రోటీన్లు, మాంసకృత్తులు, ఐరన్ ఎక్కువ శాతం ఉండడంతో రక్తం శుద్ధి అవుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఏజన్సీ ఏరియాల్లో, అటవీ ప్రాంతాల్లో రైతులు చిరుధాన్యాలను సహజసిద్ధంగా పండిస్తున్నారు. చిరుధాన్యాలను విక్రయించే ఏజన్సీలు ఈ ధాన్యాన్ని పెద్దమొత్తంలో కొని చిన్నచిన్న వ్యాపారులతోపాటు మార్కెటింగ్ చేసే వారికి అమ్ముతున్నారు.
సంప్రదాయబద్ధంగా మిల్లెట్స్ తయారీ..
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో చిరుధాన్యాలను సేకరిస్తున్నారు. కొర్రలు, సామలు, అరిరెలు, ఊదలు, అండు కొర్రలు, రాగులు, జొన్నలు, దేశీ య వరి బియ్యం ఇక్కడ మిల్లింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్లోని కొన్ని మాల్స్, మహబూబ్నగర్లోని హోల్సేల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వీటితో ఇడ్లిరవ్వ, ఉప్మారవ్వ, వివిధ రకాల పిండిలను తయారుచేసి మార్కెట్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన ధాన్యాలను నల్లమల ఏజెన్సీ ఏరియాలు, ఆంధ్రా ప్రాంతంలో పండించే రైతుల వద్ద ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడకు తీసుకొస్తున్నారు. దీన్ని సంప్రదాయబద్ధంగా పెద్ద పెద్ద విసురురాళ్లతో నూర్పిడి చేస్తున్నారు. వీటిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.
అంతేకాకుండా నూనె అవసరం లేకుండా ఎక్కువ వేడితో పిల్లలు, పెద్దలు తినే స్నాక్స్ను తయారు చేస్తున్నారు. వీటిని తినడంవల్ల కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. దేశీయ, దంపుడు, పాలీష్లేని బియ్యాన్ని తయారుచేస్తున్నారు. వీటిని ఏకంగా సింగపూర్కు ఎగుమతి చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో కూడా వీటిని అమ్ముతున్నారు.