బిజినేపల్లి, ఏప్రిల్ 3 : కొన్నినెలలుగా కాల్వల ద్వారా పారుతున్న కేఎల్ఐ నీరు శుక్రవారం నిలిచిపోయింది. బిజినేపల్లి మండలంలో అల్లీపూర్ గ్రామ శివారు వద్ద కేఎల్ఐ కాల్వ ప్రారంభమై కారుకొండ గ్రామ శివారులో ముగుస్తుంది. యాసంగి సీజన్లో ఈ కాల్వను నమ్ముకొని కాల్వ పొడవునా వందలాది ఎకరాల వరి, మొక్కజొన్న, ఇతర పంటలను సాగు చేసుకున్నారు. మొక్కజొన్న 70శాతం వరకు ఇప్పటికే పంట చేతికి వచ్చినప్పటికీ ఆలస్యంగా సాగుచేసిన మరో 30 శాతం మొక్కజొన్న పంటలకు నీటిని అందించే కేఎల్ఐ కాల్వ నిలిచిపోయింది. యాసంగి సీజన్ ప్రారంభంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల వరినారు చేతికి రాకపోవడంతో కొందరు రైతులు ఆలస్యంగా వరిపంటను సాగు చేశారు.
ఈక్రమంలో కొందరు కేఎల్ఐ నీటిని నమ్ముకొని సాగు చేయగా, మరికొందరు బోరుబావుల కింద సాగు చేశారు. బోరుబావుల కింద సాగు చేసిన రైతుల నీరు ఉన్నప్పటికీ కరెంట్ సక్రమంగా లేకపోవడంతో పంటలకు నీరు అందించలేకపోతున్నారు. పూర్తిస్థాయిలో కేఎల్ఐ కాల్వనే నమ్ముకొని మరికొందరు రైతులు వరి పంటను సాగు చేశారు. తీరా చూస్తే ఎలాంటి ప్రకటన లేకుండా అకస్మాత్తుగా కేఎల్ఐ నీటి సరఫరాను నిలిపివేయడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే పంటలు చివరి దశలో ఉన్న సమయంలో సాగునీరు నిలిచిపోవడం ఆందోళన కరమైందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో నీటిని నిలిపివేస్తే తీవ్రంగా నష్టపోతామని, మరో మూడు వారాలపాటు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటే రైతుల పంటలు పూర్తిస్థాయిలో చేతికి వస్తాయని, ఈ విషయంలో ప్రభుత్వం, సాగునీటి అధికారులు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.