అయిజ, అక్టోబర్ 5 : వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు ఎస్ఈలు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వచ్చిన వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని 2023-24 ఏడాదికి గానూ 105 టీఎంసీలు వస్తాయని బోర్డు అధికారులు అంచనా వేశారు. 105 టీఎంసీలను తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా వాటర్ డిస్ఫ్యూట్ ట్రిబ్యునల్) కేటాంయింపులకు అనుగుణంగా దామాషా పద్ధతి ప్రకారం నీటి పంపకాలు చేశారు. గురువారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం అతిథి గృహంలో తుంగభద్ర బోర్డు ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన ఎస్ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు.
తుంగభద్ర నదీ పరివాహక రాష్ర్టాలకు కేడబ్ల్యూడీటీ 212 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు నీటి కేటాయింపులు చేపట్టింది. కర్ణాటకకు 138.990, ఏపీకి 66.500, ఆర్డీఎస్కు 6.510 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం ఉన్నది. నాలుగైదు ఏండ్లుగా తుంగభద్ర నదికి వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకుని 2023-24 ఏడాదిలో తుంగభద్ర నదికి 105 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేశారు. 2023 జూన్ 8న జరిగిన సమావేశంలో తుంగభద్ర బోర్డు ఎస్ఈల సమావేశంలో 175 టీఎంసీలు వస్తాయని అంచనా వేసినప్పటికీ వానలు సమృద్ధిగా కురవకపోవడంతో డ్యాంకు వరద తగ్గిపోయింది. దీంతో అంచనాలను సవరించి ప్రస్తుతం వచ్చిన వరద నీటిని మూడు రాష్ర్టాలకు పంపిణీ చేశారు. వరద అంచనాలను బట్టి కర్ణాటకకు 68.839, ఏపీకి 32.936, తెలంగాణ రాష్ట్రంలోని ఆర్డీఎస్ 3.224 టీఎంసీలను వినియోగించుకునేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆర్డీఎస్ ఈఈ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. సమావేశంలో గద్వాల ఎస్ఈ శ్రీనివాసరావు, అనంతపురం ఎస్ఈ రాజశేఖర్, కర్నూల్ ఎస్ఈ రెడ్డి శేఖర్రెడ్డి, కర్ణాటక ఈఈ బస్వరాజు, ఎస్డీవో హసన్ భాషా తదితరులు పాల్గొన్నారు.