వెల్దండ, ఏప్రిల్ 16 : మండలంలోని కొట్ర గేటు సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ హైవే పక్కనున్న కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. 18న నిర్వహించే సన్నాహక సమావేశ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు. అలాగే మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, ఎన్నికల ఇన్చార్జి చాడ కిషన్రెడ్డితోపాటు ముఖ్య నాయకులు రానున్నట్లు చెప్పారు.
కల్వకుర్తి కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ కమిటీల బాధ్యులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నా రు. నాలుగు నెలల్లోనే సీఎం రేవంత్రెడ్డి అన్ని రకాలుగా విఫలమయ్యారని విమర్శించారు. రైతుబంధు ఇవ్వనోడు, రుణమాఫీ ఎలా చేస్తాడు? కల్యాణలక్ష్మి ఇవ్వనోడు తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తా డు? అని ప్రశ్నించారు. పాడి రైతులకు నాలుగు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని వాపోయారు. కాంగ్రెస్ను నమ్మొద్దని, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆర్ఎస్పీ ఉన్నత విద్యావంతుడని, 14 ఏండ్లపాటు సేవలందించి ఎందరో పేద విద్యార్థులకు చేయూతనిచ్చాడని తెలిపారు. తండ్రీకొడుకులకు పదవులిచ్చినా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన రాములు, భరత్ప్రసాద్కు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఆయన వెంట కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వెల్దండ జెడ్పీటీసీ విజితారెడ్డి, భాస్కర్రావు, విజయ్గౌడ్, సూర్యప్రకాశ్రావు, గోవర్ధన్, యాదగిరి, నర్సింహ తదితరులు ఉన్నారు.