మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 23 : మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు గుర్తింపు రద్దయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేశ్ అన్నారు. శుక్రవారం ఎదిర శివారులోని మెడికల్ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే జాతీయ మెడికల్ కమిషన్ మహబూబ్నగర్లో మెడికల్ కళాశాల 2018 హౌస్ సర్జన్ బ్యాచ్కు గుర్తింపునిచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఎన్ఎంసీ ఇచ్చిన డిస్ అప్రూవల్ లెటర్ కేవలం ఆధార్ బయోమెట్రిక్, కళాశాలలో కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన అంశమన్నారు.
కాగా ఇప్పటికే ఆధార్ బయోమెట్రిక్, కెమెరాలను ఎన్ఎంసీ పోర్టల్కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని, వారం వ్యవధిలో దవాఖానలో కెమెరాలను అనుసంధానం చేస్తామన్నారు. ఈ విషయాలు మన అప్పీలులో ఇప్పటికే జాతీ య మెడికల్ కమిషన్కు తెలియజేశామని చెప్పారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన వైద్య సీట్ల ప్రవేశాలు యథాతధంగా ఉంటాయని పేర్కొన్నారు. నూతన ప్రవేశాలకు ఎంసీసీ పోర్టల్లో పాలమూరు మెడికల్ కళాశాలకు సంబంధించిన సీట్లను అప్లోడ్ చేయడం పూర్తయిందన్నారు.