గద్వాల, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న పల్లెలకు కేంద్రప్రభుత్వం పట్టం కట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. అప్పటి పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం మానేసి తమ అభివృద్ధిని చూసుకున్నారు. దీంతో పల్లెల్లో అభివృద్ధి అట్టడుగుస్థాయికి చేరుకున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని సీఎం కేసీఆర్ పూనుకున్నారు. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి గ్రామాల అభివృద్ధికి నడుం బిగించా. గ్రామీణ ప్రజల జీవన విధానంలో మార్పు చెందితే అన్ని రంగాలు మార్పు చెందుతాయని భావించి గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. దీంతో పల్లెలు అభివృద్ధి వైపు అడుగులు వేశాయి.
ప్రత్యేక ప్రణాళిక
గ్రామాలను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. అధికారులు పకడ్బందీగా అమలుచేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి ‘పల్లె ప్రగతి’తో శ్రీకారం చుట్టారు. గతంలో గ్రామాల్లో చెత్త ఎక్కడపడితే అక్కడ వేయడంతో మురుగు కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేసింది. చెత్తను తొలగించడానికి పంచాయతీకో ట్రాక్టర్, ట్రాలీ అందజేశారు. గ్రామంలోని చెత్తనుట్రాక్టర్లో తీసుకెళ్లి వేసేందుకు డంపింగ్యార్డులు నిర్మించారు. పల్లె ప్రకృతివనాల పేరుతో ప్రతి గ్రామంలో ఒక పార్కును ఏర్పాటు చేసింది. పాడుబడిన బావులు, ఇండ్లను తొలగించడంతోపాటు గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అభివృద్ధిలో పోటీపడుతూ అవార్డుల కోసం సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పనులను ముమ్మరం చేయగా కేంద్రం పల్లెలకు పట్టం కడుతున్నది.
ఉత్తమ పంచాయతీలకు అవార్డులు
పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ జాతీయ పంచాయతీ అవార్డుల ద్వారా ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీలకు నగదు పురస్కారంతో ప్రోత్సహిస్తున్నది. ఈ అవార్డులు 2022లో ప్రారంభించగా ఐక్యరాజ్య సమితి సూచించిన తొమ్మిది అంశాలలో పనితీరు కనబర్చిన పంచాయతీలకు అవార్డులు అందజేసింది. పంచాయతీల పనితీరును అంచనా వేయడం, పోటీతత్వాన్ని పెంపొందించడం, 2030 నాటికి లోకలైజేషన్ సుస్టానైబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎల్ఎస్డీజీ) సాధించడానికి కృషి చేస్తున్నది. కాగా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామం జాతీయ పంచాయతీ అవార్డుకు ఎంపిక కాగా జిల్లాస్థాయిలో 26 పంచాయతీలు ఉత్తమ జీపీలుగా ఎంపికయ్యాయి.
ఎంపికైన పంచాయతీలు
పావర్టీ ఫ్రీ అండ్ లైవ్లీ హుడ్ పంచాయతీ(పీ,ఎల్హెచ్పీ)
పేదరికం లేని గ్రామ పంచాయతీ, సామాజిక భద్రత, ఎవరూ పేదరికంలోకి వెళ్లకుండా మెరుగైన జీవనోపాధి లక్ష్యంతో పనిచేస్తున్న గ్రామాల్లో రాజోళి మండలంలోని మాన్దొడ్డి, రాజోళి, గట్టు మండలంలోని గంగిమాన్దొడ్డి గ్రామాలున్నాయి.
హెల్త్లీ పంచాయతీలు
ఎదుగుదల, శక్తిహీనత లోపాలను పోగొట్టడం, కౌమార బాలికలు, మహిళల్లో రక్తహీనత తొలగించుట, తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహారం అందించడంలో.. ఇటిక్యాల మండలంలోని షాబాద్, మల్దకల్ మండలంలోని విఠలాపురం, కేటీదొడ్డి మండలంలోని మల్లాపురంతండాలున్నాయి.
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీలు
పిల్లల మనుగడ, అభివృద్ధి, భాగస్వామ్యం, సురక్షితంగా తమహక్కులను అనుభవించేలా చూడడం, ఆరోగ్యవంతమైన పిల్లలుగా ఎదిగేలా, పాఠశాలల్లో వందశాతం హాజరు, బాల్యవివాహాల కేసులు తగ్గించడం, పిల్లల అక్రమరవాణా లేకుండా చేయడం, అన్ని రకాల హింసల నుంచి రక్షణ కల్పించుటలో.. అయిజ మండలంలోని ఉప్పల, రాజోళి మండలంలోని పడమటి గార్లపాడ్, అలంపూర్ మండలంలోని బుక్కాపురం గ్రామాలున్నాయి.
వాటర్ సఫీసియంట్ పంచాయతీలు
రక్షిత, శుద్ధమైన మంచినీటి సరఫరాతోపాటు గ్రామాల్లోని అన్ని ఇండ్లకు నల్లా కనెక్షన్లు, వ్యవసాయేతర అవసరాలకు నీటి లభ్యత, నీటి సరఫరా సాంకేతిక విధానాల ద్వారా గ్రేవాటర్ శుద్ధి విభాగంలో.. మల్దకల్ మండలంలోని మేకలసోంపల్లి, ఇటిక్యాల మండలంలోని శనగపల్లి, కేటిదొడ్డి మండలంలోని గంగన్పల్లి గ్రామాలున్నాయి.
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీలుగా.. వెంకటాపురం, క్యాతూర్, లింగన్వాయి గ్రామాలు నిలిచాయి.
స్వయం సమృద్ధి విభాగంలో.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు (వీధిదీపాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, సోలార్ లైట్లు, స్త్రీ, పురుషులకు వేరువేరు మరుగుదొడ్లు, సెగ్రిగ్రేషన్ షెడ్లు, క్రిమిటోరియాలు) ఏర్పాటు చేయడంలో ముందున్న గ్రామాల జాబితాలో ధరూర్, మానవపాడు, ఉండవెల్లి మండలాలున్నాయి.
సోషల్ సెక్యూరిటీ విభాగంలో.. సామాజిక భద్రత కల్పించడంలో చెన్నిపాడ్, నందిన్నె, చంద్రశేఖర్నగర్ గ్రామాలున్నాయి.
గుడ్ గవర్నెస్ విభాగంలో.. పల్లెపాడు, కొండేరు, బూరెడ్డిపల్లి గ్రామాలున్నాయి.
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో.. గ్రామాల్లో మహిళా సాధికారత, లింగ సమానత్వం, మహిళలు, బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, బాలికలపై నేరాల శాతాన్ని తగ్గించుట, సమానపనికి సమానవేతనం చెల్లించుట, మాతృమరణాలు తగ్గించుట, ఆరోగ్యం పెంపొందించిన గ్రామాల్లో గువ్వలదిన్నె, ఉప్పల, నాగర్దొడ్డి గ్రామాలున్నాయి.
ఇలా తొమ్మిది విభాగాల్లో మంచి ఫలితాలు సాధించి జిల్లా ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికై అవార్డులు అందుకోవడంతో పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.