నాగర్కర్నూల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రజాక్షేత్రంలోకి అడుగిడనున్నారు. శనివారం నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. వ్యాపారవేత్తగా ఉన్నతస్థాయిలో ఉండి ప్రజాసేవ కోసం 2012లో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో మర్రి జనార్దన్రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రజల ఆదరణతో 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుంచి సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేశారు. దశాబ్దాల నాటి జిల్లా కలతోపాటు మెడికల్ కళాశాల ఏర్పాటు, మినీ ట్యాంక్బండ్, పెండింగ్లో ఉన్న ఎంజీకేఎల్ఐ పనులను పూర్తి చేయించారు. అలాగే వట్టెంలో వెంకటాద్రి రిజర్వాయర్, బిజినేపల్లిలోని మార్కండేయ రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీరి గతంలో ముళ్ల పొదలతో కనిపించిన భూములు నేడు పచ్చటి పంటలతో దర్శనమిస్తూ రైతుల ఇండ్లల్లో సిరులు గుమ్మరిస్తున్నాయి. దీంతో నియోజకవర్గం విద్య, వైద్యం, రోడ్లు వంటి అన్ని రంగాల్లో ప్రత్యేకతను సంతరించుకున్నది. ఎమ్మెల్యేగా వారంలో నాలుగైదు రోజులు ప్రజలతో ఉంటూ, ఆప్యాయంగా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఏ చిన్న సమస్య వచ్చినా, ఫోన్ చేస్తే పరిష్కరిస్తాడనే నమ్మకం ప్రజల్లో నెలకొంది. ఈక్రమంలో ఎంజేఆర్ ట్రస్టు ద్వారా 700 జంటలకుపైగా సామూహిక వివాహాలు, నిరుద్యోగ యువతకు పోలీస్, గ్రూప్స్, ఉపాధ్యాయ పరీక్షల కోసం ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఇటీవల ఉచిత డ్రైవింగ్ లైసెన్స్లు అందిచడంతోపాటు రూ.5కే భోజనాన్ని అని ప్రారంభించారు. ఇలా నాగర్కర్నూల్ను అభివృద్ధికి కేరాఫ్గా మార్చిన ఎమ్మెల్యే ‘పదేండ్ల ప్రజాప్రస్థానం మర్రన్న’ పేరుతో బయల్దేరనున్నారు. గతంలో జలవిజయ యాత్ర పేరుతో ఎమ్మెల్యే ఒకసారి పాదయాత్ర చేపట్టారు. ఈక్రమంలో శనివారం నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు గ్రామాల్లో ఎమ్మెల్యే కలియతిరగనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధిని యాత్రలో వివరించనున్నారు. అదేవిధంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలతో చర్చిస్తారు. కార్యాలయానికే పరిమితం కాకుండా ప్రజలతో మమేకమయ్యేందుకు ఎమ్మెల్యే మర్రి చేపట్టిన యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలువనున్నది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 117 గ్రామాల్లో 400 కిలోమీటర్లు ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టనున్నారు. మర్రితో అడుగులు వేసేందుకు నియోజకవర్గంలోని యువత, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా రానున్నారు. తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో శనివారం మధ్యాహ్నం 12గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది.
ప్రజలతో మమేకమయ్యేందుకే..
ఏడు దశాబ్దాల్లో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో చేసి చూపించాం. కలలో కూడా ఊహించని ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరందించాం. వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ను కూడా త్వరలో పూర్తి కానుంది. ఎన్నో సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. పదేండ్లలో జరిగిన అభివృద్ధిని యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా ఏమేం చేయాలో చర్చిస్తాం. ప్రజలంతా పాదయాత్రకు మద్దతివ్వాలని కోరుతున్నా..
– మర్రి జనార్దన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే