సర్కార్ బడుల్లో సకల సదుపాయాలు కల్పించి పేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ని చేపట్టింది.దీంతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన బడులు తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సహకారంతో సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. నారాయణపేట జిల్లాలో మొదటి విడుతలో 169 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో 90 శాతం పనులు పూర్తి కాగా.. త్వరలోనే ప్రారంభానికి పలు భవనాలు సిద్ధమయ్యాయి. ఎంపిక చేసినబడుల్లో బోర్డుల నుంచి భవనాలకు రంగులు వేసే దాకా అన్నిపనులను చేపట్టారు. చిన్న, పెద్ద మరమ్మతులు, ప్రహరీ, శిథిలమైన తరగతి గదుల స్థానంలో తరగతి, వంట, భోజన గదుల నిర్మాణాలు, నీటి సౌకర్యం,
టాయిలెట్లను నిర్మించారు. సకల సౌకర్యాల కల్పనతో విద్యార్థుల కష్టాలు తీరాయి.
నారాయణపేట, జనవరి 28: నాడు సర్కారు బడులంటే వసతుల లేక అస్తవ్యస్తంగా దర్శనమిచ్చేవి. తెలంగాణ ఏర్పడిన తర్వార బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు మరమ్మతులు చేపట్టేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమంతో ఇప్పుడిప్పుడే పాఠశాలలు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం మొదటి విడుతలో నారాయణపేట జిల్లాలో 174పాఠశాలలను ఎంపిక చేసి 169పాఠశాలలకు పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 90శాతం పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
169పాఠశాలల్లో మరమ్మతులు
విద్యార్థులకు డిజిటల్తోపాటు నాణ్యమైన విద్య, హాజరు శాతం పెంచడంతోపాటు అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289కోట్లతో ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరంలో మొదటి దశలో రూ.34కోట్ల 70లక్షలతో నారాయణపేట జిల్లాలో 169పాఠశాలల్లో మౌలిక వసతులకు నిధులు విడుదల చేసింది. వీటిలో రూ.30లక్షలలోపు పనులు అవసరం ఉన్న పాఠశాలలు 141, రూ.30లక్షలకుపైగా పనులు చేసేందుకు మరో 27 పాఠశాలలు ఉన్నాయి.
ప్రజల భాగస్వామ్యంతో చేయూత
‘మన ఊరు- మన బడి’ ప్రభుత్వ పథకం మాదిరిగా కాకుండా ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రభుత్వం విధానాలు రూపొందించి అమలు చేయడంతో ఈ పథకానికి మరింత చేయూత అందుతున్నది. రూ.కోటి ఆపైన ఆర్థికసాయం చేస్తే ఆయా పాఠశాలలకు దాతల పేర్లు, దాతలు సూచించిన పేర్లు పెడుతున్నారు. ఒకవేళ రూ.10లక్షలకు పైగా ఆర్థికసాయం చేస్తే దాతలు సూచించిన పేర్లను పాఠశాలలోని ఓ తరగతి గదికి పెడుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
తరగతి బోర్డుల నుంచి రంగుల దాకా..
మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో తరగతి బోర్డుల నుంచి పాఠశాలకు వేసే రంగుల పనులు చేపట్టారు. ముఖ్యంగా చిన్న, పెద్ద మరమ్మతులు, ప్రహరీ నిర్మాణాలు, శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్త గదుల నిర్మాణాలు, వంట గదుల నిర్మాణాలు, ఉన్నత పాఠశాలల్లో భోజనం గదులు, నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. అలాగే పాఠశాలకు విద్యుత్ సదుపాయం, మంచినీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలకు రంగులు వేయడం వంటి పనులు చేపట్టారు. ఈ పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేపడితే మరింత ఫలితం వస్తుందన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్లాగ్షిప్ ప్రోగ్రాంగా చేపట్టింది. పాఠశాలలను ఎంపిక చేయడంతోపాటు పనుల మంజూరుకు కలెక్టర్ బాధ్యత వహించగా, పనుల పర్యవేక్షణను పాఠశాల ఎస్ఎంసీలు, హెచ్ఎంలు చేపట్టారు.
పాఠశాలలన్నింటికీ ఒకే యూనిఫాం
గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం వివిధ రకాల రంగుల్లో ఉండగా ఇక నుంచి ఒకే రంగులో యూనిఫాంలు దర్శనమివ్వనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కలర్ కోడ్ను ఎంపిక చేసి, అదే కలర్ కోడ్తో కూడిన రంగులు వేసే విధం గా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒకే కలర్తో దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలలన్నీ ఒకే రంగుతో దర్శనమిస్తున్నాయి. పాఠశాలల ఆరు బయట గోడలు, ప్రహరీలకు నీలం, తెలుపు వేయగా, తరగతి గదుల్లోని గోడలకు ఒకే రంగును ఉపయోగించారు. వీటితోపాటు కిటికీలు, ఇనుపగ్రిల్స్, ప్రహరీ గేటు, మూత్రశాలలకు సైతం రంగులు వేశారు.
పాఠశాల గోడలపై అందమైన బొమ్మలు
బిల్డింగ్ యాజ్ ఏ లెర్నింగ్ ఎయిడ్ కాన్పెప్ట్తో పాఠశాలల గోడలపై వేసిన అందమైన బొమ్మలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలను గోడలపై చిత్రీకరించారు. ముఖ్యంగా రసాయన, జీవ, సాంఘీకశాస్ర్తాలతోపాటు మ్యాథ్స్కు సంబంధించిన అంశాలను గోడలపై విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే రీతిలో రంగు రంగులతో ఆకట్టుకునే రీతిలో చిత్రీకరించారు. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ అక్షరాలను, కూరగాయలు, పండ్లు, పూలు వంటి వాటిని పెయింట్ వేశారు.