సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది.. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.. భూగర్భ జలాలు క్రమక్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి.. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోగా.. బోరు బావుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది.. కేఎల్ఐ నీటి విడుదలలో అధికారులు తాత్సారంతో రైతుల ఆశలు అడుగంటుతున్నాయి. పంటలు చివరి దశలో ఉండడంతో యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. కోటి ఆశలతో వ్యవసాయం చేస్తే పెట్టుబడులు సైతం రాని పరిస్థితి నెలకొన్నదని అన్నదాతలు కంటతడి పెడుతున్నారు.
– నాగర్కర్నూల్, మార్చి 14
నాగర్కర్నూల్ జిల్లా రైతుల ను జల సంక్షోభం ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటల కు సాగునీటి కష్టకాలం వచ్చిపడింది. పంట చేతికొచ్చే దశలో నీళ్లు అందక ఎండు దశలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కాల్వలకు నీటిని విడుదల చేయకపోవడం, రోజురోజుకూ ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు నీరు అందుతుందన్న ఆశతో సాగు చేసిన పంటలకు కోత దశలో నీరందించలేక పోతున్నారు. మరో వారం వరకు ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీటిని అందించలేకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో చేతికొచ్చిన మొక్కజొన్న, వరి, వేరుశనగతోపాటు ఇతర పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
సాగునీటి సమస్య నాగర్కర్నూల్ జిల్లాలో ఈ యాసంగిలో 1.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.50 లక్షల ఎకరాలకు పైగా వరి, లక్ష ఎకరాలకుపైగా వేరుశనగతోపాటు అక్కడక్కడ కూరగాయాలను రైతు లు సాగు చేశారు. ము ఖ్యంగా వేరుశనగ పం ట ఏదో రకంగా చేతికి వచ్చినప్పటికీ మొ క్కజొన్న, వరి పం టలకు నీటి గం డం చుట్టుకున్న ది. కల్వకుర్తి ని యోజకవర్గాని కి ఈయాసంగిలో మొదట్లో కాల్వల ద్వారా నీటిని సరఫరా చేసినప్పటికీ ప్రస్తుతం పూర్తిగా స్థాయిలో అందక అక్కడక్కడ యాసంగి పంటలు సాగు చేసుకున్న రైతులు బోరుబావుల కింద సాగు చేసిన పంటలను గట్టెక్కించుకున్నా, చాలా వరకు పంటలు చేతికి వచ్చే సమయంలో నీరందక ఎండుదశకు చేరుకున్నా యి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని రైతులు కాల్వల ద్వారా వస్తున్న నీటితో పంటలను సాగు చేసుకుంటున్నారు.
కరెంట్ సమస్య ఉన్నప్పటికీ కాల్వల ద్వారా నీరు వస్తుండడంతో నీటి సమస్య తలెత్తడం లేదు. ముఖ్యంగా నాగర్కర్నూల్ నియోజకవర్గంలోనూ ఎత్తు ప్రాంతాల్లో ఉన్న బిజినేపల్లి, నాగర్కర్నూల్ మండలాల్లోని నల్లవెల్లి, ఉయ్యాలవాడ, బిజినేపల్లి మండలంలోని గంగారం, శాయిన్పల్లి, పోలేపల్లి, ఖానాపూర్, మంగనూర్, గ్రామాలతోపాటు చుట్టు పక్కల తండాల రైతుల పొలాలు సాగునీరు అందక పూర్తిగా ఎండుముఖం పట్టాయి. బిజినేపల్లి మండలం సల్కర్పేట సమీపంలోని బైకెనాల్ వద్ద తరచూ కేఎల్ఐ అధికారులు షెట్టర్ను పూర్తిస్థాయిలో ఎత్తకపోవడంతో బిజినేపల్లి, నాగర్కర్నూల్ మండలాల మీదుగా ఉన్న పిల్ల కాల్వల ద్వారా సాగునీరు రాకపోవడంతో రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బిజినేపల్లి, నాగర్కర్నూల్ మండలాల్లో రాత్రి 12గంటల తర్వాత త్రీఫేజ్ కరెంట్ను సరఫరా చేయడంతో నిద్రాహారాలు మాని రైతులు పంట పొలాలకు నీరు పార పెట్టుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలపాటు కరెంట్ సరఫరా చేశారని, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కరెంట్ కష్టాలు మొదలయ్యాయని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 12 గంటల నుంచి మరోసారి రోజు సాయంత్రం వరకు మాత్రమే త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేస్తుండడంతో బోర్లద్వారా తోడుకున్న నీటిని నిల్వ చేసుకొని పొలాలకు తడి ఆరకుండా చూసుకుంటున్నారు మరికొందరు రైతులు. తెలకపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొన్ని రోజలుగా త్రీఫేజ్ కరెంట్ సమస్యతో ఆలేరు తదితర ప్రాంతాల్లో బోర్లు, స్టార్టర్లు కాలిపోయిన ఘటనలు ఉన్నాయి.
ఓవైపు ఎండల తీవ్రత పెరిగి భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం, మరోవైపు కాల్వల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో కోతకు వచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కళ్లముందు ఎండుతున్న పంటలను చూసి ఎప్పుడు కరెంట్ వస్తుందోనని ఎదురు చూడాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది. పదిరోజులుగా కేఎల్ఐ నీటి సరఫరా కాకపోవడంతో మూడు రోజుల కిందట రైతులు బైకెనాల్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయింది. అయినా నీటిని విడుదల చేయడంలో కేఎల్ఐ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా పంటలను కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో తమకు ఉన్న బోరుబావుల నుంచి గుక్కి గుక్కి పోస్తున్న నీటిని కేఎల్ఐ కాల్వల్లో నిల్వ చేసుకొని పంట పొలాలకు పారపెట్టుకున్నారు. ఏదేమైనా ఈసారి యాసంగిలో పంటల సాగుకు రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం.