అలంపూర్ చౌరస్తా/అయిజ, ఏప్రిల్ 28 : మక్క కొనుగోళ్లలో అధికారుల అలస్యంతో రైతులు పడిగావులు కాస్తున్నారు. గన్నీ బ్యాగులు, లారీల రవాణా, సౌకర్యాలు, దళారులు, పైసా వసూళ్ల కష్టాలతో రైతన్న అపసోపాలు పడుతూ కేంద్రాల వద్ద నరకయాతన పడుతున్నాడు. మక్కల బస్తాలను తుకాం వేసిన రోజులు గడుస్తున్న తరలించేందుకు లారీలు లేకపోవడంతో వర్షం పడితే తీవ్ర నష్టం వాటిల్లితుందని రైతులు లబోదిబోమంటున్నారు. ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్, ఎర్రవల్లి మండలాలకు చెందిన మొక్కజొ న్న రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్లో ఉన్న కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే కేంద్రం ఆలస్యంగా ప్రారంభించడంతో అప్పటికే మక్కలను తెచ్చిపెట్టుకున్నారు. ప్రారంభం కావడంతో ఒక్కసారిగా కొనాలంటూ అధికారులను రైతులు కోరారు. దీంతో అధికారులు ముందు వచ్చిన రైతులకు గుర్తించి టోకెన్లు ఇచ్చి కొనుగోలు జరిపారు.
తెలంగాణ మార్కెట్యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం కావడంతో ఏపీ రాష్ర్టానికి చెందిన దళారులు పాగా వేశారు. కమీషన్లు ఇస్తామంటూ దళారుల బంధువులు, గ్రామాల్లో ఉండే ఇతర రైతుల పాస్బుక్లు తీసుకుని మార్కెట్యార్డ్లో పెత్తనం చలాయిస్తున్నారు. వీరి కి తోడు అధికారులు కూడా వంతు పలకడంతో క్రమ సంఖ్యలో ఉన్న రైతులను కాకుండా దళారులు తెచ్చిన మక్కలను అధికారులు ముందు కొనుగోలు చేయడం మార్కెట్యార్డులో చర్చనీయాంశంగా మారింది.
అలంపూర్ మండలంలో రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం గన్నీ బ్యాగులను అందించాలేమని చేతులెత్తేయడంతో రైతులకు దిక్కతోచడం లేదు. గన్నీ బ్యాగులు రైతులే తెచ్చుకుంటే కొనుగోలు జరుపుతామని చెప్పడంతో గత్యంతరం లేక ఏపీలోని కర్నూల్లో ఒక్కో సంచి రూ.28 నుంచి రూ.30 పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి నెలకొన్నది. అయితే సంచి కి రూ.15 ఇస్తామని అధికారులు చెబుతున్నా ఎలాంటి రసీదులు ఇవ్వ డం లేదని రైతులు వాపోయారు. సంచి పై తెలంగాణ లేబుల్ వేయడానికి కూడా మా ర్కెట్యార్డులో రూ.2.50 వసూలు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని వా పోయారు. మక్కలను సంచులలో నింపిన తర్వాత లారీల సమస్య ఏర్పడడంతో మార్కెట్ ఆవరణలోనే రోజుల తరబడి మక్క సంచులను ఉంచాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ 238 మంది రైతులకు సంబంధించిన 19,571 వేల క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేసి తరలించారు. అయితే 21.924 వేల క్వింటాళ్ల మక్కలను తూకం వేసి సంచులలో నింపి లారీల కోసం మార్కెట్ ఆవరణలో ఉంచారు. అయితే ఇంకా 60 నుంచి 70 వేల క్వింటాళ్లు మార్కెట్లోనే ఉంచారు.
అయిజ కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన మక్క బస్తాల తరలింపులో జాప్యం నెలకొన్నది. 15 రోజులైనా గోదాంలకు ధాన్యం తరలించకపోవడంతో ఎండ, వానకు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. అయిజ పట్టణంలోని మార్కెట్ యార్డుకు పట్టణంతోపాటు మండలంలోని 28 గ్రామాలకు చెందిన రైతులు మొక్కజొన్నను తరలించారు. దాదాపు 55,228 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు.
దిగుబడులకు అనుగుణంగా కొనుగోలును వేగవంతం చేసినా అధికారులు బస్తాలను తరలించడంలో విఫలమవుతున్నారు. రోజుకు కనీసం పది లారీల ద్వారా బస్తాలను తరలించాల్సి ఉండగా, కేవలం ఐదు లారీల్లోనే ధాన్యాన్ని గోదాంలకు తరలించడంతో బస్తాలు పేరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు అయిజ కొనుగోలు కేంద్రంలో 1,20,513 బస్తాలను 926 మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. 69,519 బస్తాలను గోదాంకు తరలించగా, మార్కెట్లో 52,994 బస్తాలు నిల్వ ఉన్నాయి. రోజురోజుకు కొను గోలు చేస్తున్న మొక్కజొన్న బస్తాలను గోదాంలకు తరలిస్తే రైతులకు కష్టాలు తగ్గుతాయి. సాయంత్రం అయిందంటే రైతులకు కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్ముంటూ గడుపుతున్నారు. అకాల వర్షాలు కురిస్తే మొక్కజొన్న తడిస్తే మద్దతు ధర లభించదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.