నారాయణపేట, మే 9 : కొత్తగా ఏర్పాటైన పేట జిల్లాను పాత జిల్లాలకు దీటుగా అభివృద్ధ్ది చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పర్యటన సందర్భంగా పట్టణంలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రగతిసభలో ఆయన మాట్లాడారు. రూ.82.44 కోట్లతో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో మిషన్ భగీరథ పథకం లేనప్పుడు వారానికి ఒకసారి మంచినీరు వచ్చేదన్నారు. రూ.29కోట్లతో కొత్తగా పైప్లైన్లు, ట్యాంకులు ఏర్పాటు చేసుకొన్నామని, రానున్న పదిరోజుల్లో ప్రతిరోజూ తాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మిషన్ భగీరథకు మరో రూ.28కోట్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. పేటకు సైనిక్ స్కూల్ మంజూరు చేశామని ఇటీవలే ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
సైనిక్ స్కూల్ ఏర్పాటుకు అడిగిన వెంటనే 50ఎకరాల స్థలాన్ని చూపించామని, అయినా కేంద్రం మంజూరు చేయలేదని విమర్శించారు. చేనేత కార్మికుల విషయంలో బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, చేనేతపై పన్ను విధించిన ఘనత కేంద్రానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతుధర ఇస్తుందనే కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా ధాన్యం ఇక్కడకు తరలివస్తుందన్నారు. నవోదయ పాఠశాల ఏర్పాటుకు కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని మంత్రికి విన్నవించారు. పేట నియోజకవర్గంలోనే నెలలో రూ.8కోట్ల 30లక్షల ఆసరా పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామ శివారులో రైతులు గత కొన్ని ఏండ్లుగా 200 ఎకరాల్లో పంటలను సాగు చేసుకుంటున్నారని, ఆ ఎకరాలపై యాజమాన్య హక్కులు కల్పించాలని మంత్రిని కోరారు. అదేవిధంగా మిగిలిన 800ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేయాలని పేర్కొన్నారు. మినీ స్టేడి యం నిర్మాణానికి మరో రూ.4కోట్లు మంజూరు చేయాలని, ఈద్గా అభివృద్ధికి రూ.2.5కోట్లు, గిరిజనుల కోసం జిల్లా కేం ద్రంలో సేవాలాల్ భవన్ మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్కు విన్నవించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలను గెలిచి తమ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత ర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు రూ.50 కోట్లు
నారాయణపేట టౌన్, మే 9 : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రగతిసభలో జెడ్ఎంఎంఎస్ మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన రూ.50కోట్లకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ సంఘాల సభ్యులకు అందజేశారు. అదేవిధంగా పట్టణ మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన రూ.6.89లక్షల చెక్కును సభ్యులకు అందజేశారు. అలాగే సీడీపీ నిధుల ద్వారా రైతు వేదికలకు మంజూరైన కంప్యూటర్లను ఏఈవోలకు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని మృతి చెందిన మహిళా కార్యకర్తకు మంజూరైన రూ.2లక్షల చెక్కును మృతురాలి కుమారుడు బన్నేష్కుమార్కు అందజేశారు. అంతకు ముం దు దళితబంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్మన్ వనజాగౌడ్, ప్రభుత్వవిప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.