స్వయం సంఘాలకు ఇచ్చిన రుణాలు స్వాహా అయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.24 లక్షలను వసూలు చేసి బ్యాంకులకు కట్టకుండా ఓ బుక్కీపర్, సర్పంచ్ భర్త కాజేశాడు. మహిళా సంఘాల్లోని సభ్యుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నాలుగేండ్లుగా ఈ బాగోతం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక భార్య సర్పంచ్గా గెలిచాక కూడా వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి కాంట్రిబ్యుషన్ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద వచ్చిన ఆరుగురి వ్యక్తిగత రుణాలు మింగేశాడు. మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత అధికారుల విచారణలో రుణాలను మింగేసినట్లు వెల్లడైంది.
గట్టిగా నిలదీయడంతో మొత్తం చెల్లిస్తానని బాండ్లు సైతం రాసిచ్చాడు. చివరకు తీసుకున్న రుణాలకు వడ్డీకి, వడ్డీ పెరగడంతో సంఘాలకు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. రూపాయి కూడా తాము ముట్టలేదని, అలాంటప్పుడు లక్షలకు లక్షలు కట్టమని బ్యాంకు అధికారులు, డీఆర్డీఏ ఆఫీసర్లు ఒత్తిడి తేవడంతో భూత్పూర్ పోలీస్స్టేషన్ను వారు ఆశ్రయించారు. ఇదిలా ఉంటే రుణాలు వాడుకున్న ఘనుడు తాజాగా బీజేపీలో చేరాడు. ఆగడాలకు అంతు లేకుండా పోయిన అతడిని చివరకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ డీఎస్పీ మహేశ్ తెలిపారు.
మహబూబ్నగర్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 2017లో స్త్రీనిధి కింద 25సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.లక్షా రెండువేల 500 చొప్పున రూ.25లక్షల 62 వేల ఐదు వందలు మంజూరయ్యాయి. రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతినెలా రూ.లక్షా యాభై వేలు ఈఎంఐ కట్టాలి. ఈగ్రామానికి బుక్ కీపర్గా ఉన్న నర్సింహులు రుణాలు పొందిన మహిళా సంఘాల వద్ద ప్రతినెలా వసూలు చేసి బ్యాంకులకు కట్టకుండా ఎగ్గొట్టారు. దీంతో మూడు నెలల తర్వాత ఈ వ్యవహారం బయటపడింది. దీంతో హడావిడిగా రూ.50వేలు జమచేశారు. 2018 జనవరిలో సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఈఎన్నికల్లో తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాడు. అయితే మహిళా సంఘాల డబ్బులు వాడుకున్న వ్యక్తిని ఎలా సర్పంచ్ చేస్తారని మహిళలు నిలదీయడంతో అప్పటి వరకు ఉన్న బకాయి రూ.4లక్షల 6వేల 617 కట్టి పోటికి దిగారు. సంఘాల డబ్బులు తిన్నది తానేనని తానే కడ్తానని గ్రామపెద్దల ముందు ఒప్పుకుని బాండ్ రాసిచ్చారు. భార్య సర్పంచ్ కావడంతో ఇక ఆయన ఆగడాలకు అంతులేకుండా పోయింది.
మూడు బోగస్ సంఘాల ద్వారా మరో రూ.8లక్షలు
తన కుటుంబీకుల పేరుతో మూడు బోగస్ సంఘాలను సృష్టించి రూ. 8లక్షల వరకు రుణం తీసుకున్నారు. దీంట్లో కూడా కొంతమంది అమాయక మహిళలను ఇరికించారు. కష్టజీవులు, ఆరాధన, లక్ష్మీప్రసన్న సంఘాల పేరుమీద ఈరుణాలు తీసుకున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి 230 మంది వద్ద రూ.900 చొప్పున రూ.2లక్షల 7వేలు వసూలు చేసి వాటిని కూడ స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద గ్రామంలో ఆరుగురు దళితులకు మంజూరైన రూ.3లక్షల రుణాన్ని లబ్ధిదారులకు తెలియకుండా వాడుకున్నట్లు బయటపడింది. దీంతో గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు నిలదీస్తే రూ.2లక్షలు కట్టి మిగతా రూ.11 లక్షల 50వేలకు బాండ్ రాసిచ్చాడు. ఇంతవరకు కట్టకపోవడంతో డీఆర్డీఏ అధికారులు ఒత్తిడి తేవడంతో మహిళా సంఘాల సభ్యులు సర్పంచ్ భర్త నర్సింహులుపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.
అన్నాసాగర్ సర్పంచ్ భర్త జైలుకు..
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 6: మహిళా సంఘాల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలపై అన్నసాగర్ సర్పంచ్ భర్త కరెంట్ నర్సింహులుపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు మహబూబ్నగర్ డీఎస్పీ మహేశ్ తెలిపారు. దళిత మహిళలు తమ నిధులు కాజేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గ్రామ మహిళా సమాఖ్యలో బుక్ కీపర్గా పనిచేస్తున్న నర్సింహులు మహిళలకు సంబంధించిన రుణాలను ఎస్సీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించడంపై మహిళలు అన్నసాగర్ పీఎస్లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజులుగా అతిడిని పోలీసులు విచారణ చేశారు. రూ.24.56లక్షల నిధులు దుర్వినియోగం చేశారని ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు. శనివారం గ్రామానికి చెందిన పలువురు మహిళలను మహబూబ్నగర్ డీఎస్పీ కార్యాలయంలో విచారణ చేసిన డీఎస్పీ మహేశ్ వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. పోలీసులు ఒక్కో మహిళకు సంబంధించిన నిధుల వివరాలను ఆరా తీశారు. ఈ విషయంపై సోషల్ ఆడిట్ చేసి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు.
మా డబ్బులు వాడుకున్నారు
మాగ్రామంలోని మహిళా స్వయం సంఘాలకు రుణం మంజూరైంది. బుక్ కీపర్గా ఉన్న సర్పం చ్ భర్త నర్సింహులు మా వద్ద డబ్బులు వ సూలు చేసి బ్యాంకులకు కట్టలేదు. వడ్డీ పెరిగిపోయింది. అడిగినప్పుడల్లా కడ్తానని అంటున్నారు. బాండ్లు కూడా రాసిచ్చాడు. అధికారులు, బ్యాంకు వాళ్లు మమ్మల్ని కట్టమని ఒత్తిడి చేస్తున్నారు.
– యాదమ్మ, అన్నాసాగర్, భూత్పూర్ మండలం
మా రుణాలు ఎవరు కట్టాలి?
మహిళా సంఘాల సభ్యుల వద్ద వసూలు చేసి వాడుకుని ఇప్పుడు మమల్ని కట్టమంటే మేం ఎట్లా కట్టాలి? అడిగిన ప్రతిసారి కడ్తా అని దాటవేస్తున్నారు. బాండ్లు రాసిచ్చాడు అయిన రూపాయి కడ్తలేరు. బ్యాంకుకు పోతే మా ఖాతాల్లోని డబ్బులు జమ చేసుకుంటామని అంటున్నారు. ఇదేం అన్యాయం.
– సుజాత, అన్నాసాగర్, భూత్పూర్
దొంగలకు బీజేపీ సపోర్టా..?
మా గ్రామంలో మహిళా సంఘాల డబ్బులు వాడుకున్నోళ్లకు బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఇది తప్పు అనేది పోయి అతన్ని పార్టీలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం. దొంగలకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని అర్థం అయిపోయింది. సంఘాల డబ్బులు వాడుకున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతాం.
– రాజిరెడ్డి, ఉపసర్పంచ్, అన్నాసాగర్, భూత్పూర్