అయిజ, జూలై 20 : తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్న ది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ, భద్ర జలాశయాల నుంచి టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. టీబీ డ్యాంలో 1,47,178 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, 31 గేట్లు ఎత్తి 1,28,247 క్యూసెక్కు లు దిగువకు వదులుతున్నారు. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 99.937 టీఎంసీలు నిల్వ టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 1,28,247 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 1,27,700 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 547 క్యూసెక్కులు వదిలినట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 13.8 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
జూరాలలో..
ఆత్మకూరు/అమరచింత, జూలై 20 : జూరాల రిజర్వాయర్కు వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. బుధవారం సాయంత్రానికి 93 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఏడు గేట్లెత్తి గేట్ల నుంచి 28,315 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఎగువ, దిగువ జూరాలలోని 12 యూనిట్లలో 41,465 క్యూసెక్కులను వినియోగిస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.727 నీటి నిల్వ ఉన్నది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1500, భీమా-1కు 1300, ఎడమ కాలువకు 920, కుడి కాలువకు 590, సమాంతర కాలువకు 500 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 74,678 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు..
శ్రీశైలం, జూలై 20 : శ్రీశైలం జలాశయానికి బుధవారం సా యంత్రం జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి 28,098, విద్యుదుత్పత్తి నుంచి 41,115, సుంకేసుల నుంచి 1,10,184 క్యూసెక్కులు (మొత్తం 1,79,397 క్యూసెక్కులు) విడుదల కాగా.., సాయంత్రానికి రెండు లక్షల యాభైవేల క్యూసెక్కులకు పైగా జలాశయానికి నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.., ప్రస్తుతం 877.60 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 176.33 టీఎంసీలు నిల్వ ఉన్నది. టీఎస్ పవర్హౌస్లో విద్యుదుత్పత్తి నుంచి 6,357 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.