మహబూబ్నగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా ఏకధాటిగా వర్షాలు పడి తెరిపినివ్వడంతో రైతులు సాగుబాట పట్టారు. పంట పొలాలను సిద్ధం చేసిన రైతన్నలకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన రైతుబంధు డబ్బులు కూడా ఉత్సాహం నింపింది. భారీగా వరదలు వస్తుండడంతో జూరాల, సంగంబండ, కోయిల్సాగర్, భూత్పూర్, నెట్టెంపాడు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. జూరాల, ఆర్డీఎస్, ఎంజీకేఎల్ఐ కాలువలకు సాగునీరు విడుదల చేస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కాస్త ఒరిపినివ్వడంతో వ్యవసాయ కూలీలు కూడా పొలం బాటపట్టారు. ఇప్పటికే కందులు, ఆముదాలు, మొక్కజొన్న, పత్తి విత్తనాలను వేశారు. వానలు అనుకున్న స్థాయిలో పడడంతో వరిని పెద్ద ఎత్తున సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కళకళలాడుతున్న వాగులు, వంకలు..
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని వాగులు, వంకలు కళకళలాడుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని దుందుభీ, ఊకచెట్టు, మాగనూరు, కందూరు వాగుల్లోకి నీరు చేరింది. చాలా వరకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. కొన్ని చెరువుల్లో సగం వరకు నీరు వచ్చి చేరింది. భూగర్భజలాలు పెరగడంతో వ్యవసాయ బోర్లు రీచార్జ్ అయ్యాయి. ఆర్డీఎస్, ఎంజీకేఎల్ఐ, భీమా కాల్వలకు కూడా అధికారులు సాగునీరు విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లా అంతటా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ సారి పత్తి పంటలను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు.
కూలీలకు పెరిగిన డిమాండ్..
వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఆయా జిల్లాల్లో వ్యవసాయ కూలీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కూలీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వ్యవసాయ కూలీల కొరత ఏర్పడడంతో ఇతర రాష్ర్టాల కూలీలకు ఫుల్డిమాండ్ ఏర్పడింది. కలుపు తీసేందుకు, నాట్లు వేసేందుకు, పొలం దుక్కి దున్నేందుకు, విత్తులు విత్తేందుకు ఇలా.. కూలీలకు దినసరి కూలి రూ.300కు చేరింది. ఇతర రాష్ర్టాల కూలీలను గంపగుత్తగా మాట్లాడి వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. డిజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ రేట్లు కూడారెట్టింపయ్యాయి.
పొలం పనుల్లో రైతన్నలు
ఇటీవల కురిసిన వర్షాలు మెట్టపంటలకు అనుకూలంగా ఉండడంతో భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. పుష్కలంగా నీరు అందుబాటులో ఉండడంతో వనపర్తి జిల్లాలో ఎక్కువ శాతం వరి సాగు చేయనున్నారు. కందులు, రాగులు, ఆముదాలు వేసిన చోట కూలీలు కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. జూన్ మొదటి వారంలో వానకాలం ప్రారంభం కాగా, స్వల్ప వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం కన్నా మించి నమోదైంది. జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున పత్తిని సాగుచేశారు. చాలా చోట్ల జూన్లోనే పత్తి విత్తనాలు విత్తినా.. వర్షాభావం వల్ల మొలకెత్తలేదు. కొన్ని చోట్ల స్ప్రింక్లర్లు, ట్రాక్టర్ల ద్వారా నీరందించి విత్తనాలను బతికించుకునే ప్రయత్నం చేశారు. చివరకు మొలకెత్తని చోట మళ్లీ విత్తుతున్నారు.
రైతుబంధుతో ఆసరా..
మహబూబ్నగర్ జిల్లాలో 2,19,844 మంది రైతులకు రూ.229.80 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 3,01,343 మంది రైతులకు రూ.377.17 కోట్లు, వనపర్తి జిల్లాలో 1,71,467 మంది రైతులకు రూ.184.39 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,67,865 మంది రైతులకు రూ.231.27 కోట్లు, నారాయణపేట జిల్లాలో 1,56,486 మంది రైతులకు రూ.199.53 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. సమయానికి రైతుబంధు డబ్బులు పెట్టుబడికి ఆసరాగా నిలవడంతో అన్నదాతలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.