ఇరుకు గదులు..మచ్చుకైనా కానరాని మౌలిక వసతులు..చెట్ల కింద చదువులు..పురుగుల అన్నం..నీళ్ల చారు..ఇదంతా గతం. స్వరాష్ట్రంలో పరిస్థితులు మారాయి. విద్యావ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ‘మన ఊరు-మన బడి’ పథకంలో సర్కార్ బడులకు మహర్దశ పట్టనున్నది. ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించడంతో సర్కార్ బడుల్లో అడ్మిషన్లు పెరిగాయి. 1370 మంది విద్యార్థులతో గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందగా, ఈ ఏడాది 200 మంది చేరారు. ఇప్పటికే 7,10వ తరగతుల్లో అడ్మిషన్లు ఫుల్ కావడం విశేషం.
గద్వాల, జూలై 16 : రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటాపాటలు, విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. వసతులు, బోధన గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో గతేడాది 1,199 మంది విద్యనభ్యసించారు. అప్పుడు రా్రష్ట్రంలోనే అధిక విద్యార్థులు ఉన్న పాఠశాలగా ప్రత్యేక స్థానం దక్కించుకున్నది. ఈ ఏడాది పాఠశాలలో ఇప్పటికే 200 మందికిపైగా విద్యార్థులు అదనంగా చేరారు. దీంతో ప్రస్తుతం పాఠశాలలో సుమారు 1,370 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఆ పాఠశాలలో ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో విద్యార్థులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. ఇంగ్లిష్ మీడియంలో 6 నుంచి 10వ తరగతి వరకు 560 మంది, తెలుగు మీడియంలో 810 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల పునఃప్రారంభమైన మూడు రోజులకే పాఠశాలలో విద్యార్థులకు సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. ‘మన ఊరు-మనబడి’లో భాగంగా పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంతోపాటు మెరుగైన బోధన అందుతుండడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు మధ్యాహ్న భోజనం, ఉచిత బస్పాస్లు అందిస్తుండడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ‘ప్రైవేట్ పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు’ అని భావించి క్యూ కడుతున్నారు.
పాఠశాలలో కల్పించిన సౌకర్యాలు..
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సులభరీతిలో విద్యనందిస్తున్నారు. నూ తనంగా సైన్స్ల్యాబ్, విద్యార్థులు కంప్యూటర్ నేర్చుకునేందుకు వీలుగా సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో 28 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ హవర్స్ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల కృషితో 2021-22 సంవత్సరంలో ఈ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు పదో తరగతిలో 10 జీపీఏ సాధించారు. జిల్లాలోనే 10 జీపీఏ సాధించడం ఈ పాఠశాల ప్రత్యేకత. ఇప్పటికే ఈ పాఠశాల లో 10, 7వ తరగతుల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియం లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడంతో అడ్మిషన్లు నిలిపివేశారు. ప్రతి రోజూ క్రమ పద్ధతిలో చదువులతోపాటు విద్యార్థులు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడడం.. ఆటలతోపాటు జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులు విద్యార్థుల చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. విద్యార్థులతోపాటు వా రి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి తమ పిల్లలను ప్ర భుత్వ పాఠశాలలకు పంపుతున్నారు.
ఆదరణ పెరుగుతున్నది..
విద్యపై ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడంతో ఇది పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి బోధన ఉండడంతో విద్యార్థులు ఇక్కడికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలదే హవా.
– విష్ణు, హెచ్ఎం, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల